● పక్కా పర్యవేక్షణ.. బోధన
● పోటీ పరీక్షలకు కోచింగ్
● ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు
విద్యార్థుల ఆసక్తి
ఖలీల్వాడి: ఇంటర్మీడియట్ బోర్డు తీసుకువచ్చిన సంస్కరణలతో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు బలోపేతమవుతున్నాయి. కాలేజీల్లో మౌలిక వసతులు, బోధన, అధికారుల పర్యవేక్షణతో కళాశాలలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. జిల్లాలో మొత్తం 16 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా, గతేడాది ఫస్టియర్లో 3,300 మంది చేరారు. ఈ ఏడాది అడ్మిషన్ల సంఖ్యలో ఇప్పటి వరకు 4250కి పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 20శాతం అడ్మిషన్లు పెంచాలని ఇంటర్ బోర్డు అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో లెక్చరర్లు ‘కాలేజీ బాట’లో భాగంగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ కాలేజీల్లో సౌకర్యాలపై అవగాహన కల్పించారు. ఫలితంగా ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. జిల్లా కేంద్రంలోని కోటగల్లీ బాలికల జూనియర్ కాలేజీలో 730 మంది అడ్మిషన్లు తీసుకోగా, కమ్మర్పల్లి జూనియర్ కాలేజీలో అడ్మిషన్లు వంద దాటాయి. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉదయం టిఫిన్స్, మధ్యాహ్నం భోజనం అమలు చేయగా, రెండో విడతలోనూ జిల్లాను ఎంపిక చేశారు. ఇది త్వరగా అమలు చేస్తే అడ్మిషన్ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రైవేట్ కళాశాలల్లో ఫీజుల మోతను భరించలేని తల్లిదండ్రులు.. తమ పిల్లలను గురుకుల కళాశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారని, అక్కడ సీట్లు రానివారు ప్రభుత్వ కళాశాలలను ఎంపిక చేసుకుంటున్నారని పలువురు పేర్కొంటున్నారు.
జేఈఈ, ఎప్సెట్, క్లాట్ కోచింగ్
ప్రభుత్వ కాలేజీల్లో ఐఎఫ్పీ (ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్) టచ్ స్క్రీన్పై డిజిటల్ బోధన చేస్తున్నారు. సెంకడియర్ విద్యార్థులను జేఈ ఈ, ఎంసెట్, ఎప్సెట్, క్లాట్(కామన్ లా అడ్మిషన్ టెస్ట్) తదితర పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నారు. ప్రాక్టికల్స్ నిర్వహణకు ప్రతి కాలేజీ రూ.25 వేల చొప్పున అందిస్తున్నారు. పర్యవేక్షణ కోసం ప్రతి కళాశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు ఎఫ్ఆర్ఎస్(ముఖ గుర్తింపు) హాజరు అమలు చేస్తున్నారు. కాలేజీకి విద్యార్థి గైర్హాజరైతే వెంటనే తల్లిదండ్రులకు మెస్సేజ్లు వెళ్తుండడంతో విద్యార్థుల హాజరు శాతమూ పెరుగుతోంది. ల్యాబ్లు, క్రీడా కార్యక్రమాలు, ఇతర మౌలిక వసతులకు నిధులను కేటాయిస్తున్నారు.
ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన జిల్లా కేంద్రంలోని కోటగల్లీ ప్ర భుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు తీసుకునేందుకు విద్యార్థినులు ఆసక్తి చూపుతున్నారు.
ఈ విద్యా సంవత్సరానికి ఇప్పటి వరకు 730 మంది విద్యార్థినులు అడ్మిషన్లు తీసుకున్నారు. గతేడాది 580 మంది విద్యార్థినులు చేరగా, ఈ ఏడాది అడ్మిషన్ల సంఖ్య ఇప్పటి వరకు 150కి పెరిగింది.
15 వరకు అడ్మిషన్లు తీసుకుంటాం
జిల్లాలోని ప్రభుత్వ కాలేజీల్లో ఫస్టియర్ విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించాం. కాలేజీల్లో మౌలిక వసతులు కల్పించడతోపాటు పోటీ పరీక్షలకు కోచింగ్ అందిస్తున్నాం. డిజిటల్ బోధన, అనుభజ్ఞులైన లెక్చరర్లు ఉన్నారు. ఈనెల 15 వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది.
– రవికుమార్, డీఐఈవో, నిజామాబాద్


