రుద్రూర్: పోతంగల్ మండలం కారేగాం శివారులోని పంటపొలాల్లో శనివారం కొండచిలువ ప్రత్యక్షమవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పొలాలకు వెళ్లిన రైతులు భారీ కొండచిలువను గుర్తించి, అది జంతువును మింగినట్లు అనుమానించారు. విషయం గ్రామంలో వ్యాపించడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. జంతువును మింగిన కారణంగా కొండచిలువ కదలలేని స్థితిలో ఉండడంతో కొంతసేపు అదే ప్రాంతంలో కనిపించింది. దీంతో అడవికి సమీప ప్రాంతాల్లో సంచరించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని స్థానికులు పేర్కొన్నారు.
రుద్రూర్: మండలంలోని అక్బర్నగర్ సమీపంలో శనివారం బొలెరో వాహనం కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. కర్ణాటక రాష్ట్రంలోని హున్నాబాద్ నుంచి బోధన్కు వెళ్తున్న బొలెరో కొరియర్ వాహనం ఉదయం వేళ ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. రాత్రంతా నిరంతరాయంగా వాహనం నడపడంతో నిద్రమత్తులో కల్వర్టును గమనించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో వాహనం దెబ్బతిన్నప్పటికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


