నిజామాబాద్ రూరల్: ఇందూరు నగరం నేడు నిర్వహించే ఊర పండుగకు ముస్తాబైంది. కులమతాలకు అతీతంగా నగరంలో ప్రతిఏటా నిర్వహించే ఈ పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆషాఢమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం రోజు ఊరపండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సుమారు 78 ఏళ్ల క్రితం నగరంలో కలరా, ప్లేగు వ్యాధులు ప్రబలడంతో తమను కాపాడాలంటూ ప్రజలు గ్రామదేవతలను ప్రతిష్టించి పూజలు చేశారు. వ్యాధులు తగ్గుముఖం పట్టడంతో అప్పటి నుంచి ప్రతియేటా భక్తిశ్రద్ధలతో ఊర పండుగను నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఊర పండగను ఘనంగా నిర్వహించేందుకు సర్వసమాజ్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మున్సిపల్, పోలీసు శాఖలు సైతం తగిన ఏర్పాట్లు చేశారు.
భారీ ఊరేగింపు..
ఊర పండుగలో భాగంగా అమ్మవార్ల ఊరేగింపులో నగరవాసులు భారీ సంఖ్యలో పాల్గొని, వారి ఆశీర్వాదం కోసం పూజిస్తారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా బండారు పోసిన తర్వాత నగరంలోని నాకాశ్ గల్లీలో మామిడికర్రతో విగ్రహాలను సిద్ధం చేశారు. 44 కుల సంఘాలు పట్టిలు కట్టాయి. ఇతర సంఘల సైతం పండుగలో పాల్గొంటాయి. ఖిల్లా శారదాంబ గద్దె నుంచి ప్రారంభం కానున్న గ్రామదేవతల ఊరేగింపు పెద్దబజార్ చౌరస్తా వద్ద దుబ్బ, వినాయక్ నగర్, సిర్నాపల్లి గడి దిశగా విడి పోతుంది. గాజుల్ పేటలోని వివేకానంద చౌరస్తా వద్ద భారీ పోలీసు బందోబస్తు మధ్య సరి (ఇంటిపై చల్లుకునే పదార్థం) కోసం నగరవాసులు పోటీ పడుతారు. నగరంలో 12 గుడులు ఉండగా దుబ్బ ప్రాంతంలో రాట్నం, చక్రం, పెద్దమ్మ, పౌడటమ్మ, వినాయక్ నగర్లో మహలక్ష్మీ, ఐదు చేతుల పోచమ్మ, మత్తడి పోచమ్మ, సిర్నాపల్లి గడీ రోడ్డులో కొండల రాయుడు, బోగస్వామి, సమ్మక్క, సారక్క ఇలా మొత్తం 14 అమ్మవార్లు కొలువుదీరుతాయి.
నేడు నగరంలో సర్వసమాజ్
ఆధ్వర్యంలో నిర్వహణ
ఖిల్లా వద్ద ఉన్న శారదాంబ గద్దె
నుంచి అమ్మవార్ల ఊరేగింపు
పాల్గొననున్న అన్ని కుల సంఘాలు


