నిజామాబాద్ అర్బన్: ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ఆగస్టు 15వ తేదీలోగా ‘జలసిరి’ పనులను పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ భుజంగరావు సూచించారు. జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సము దాయంలో సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భుజంగరావు మాట్లాడుతూ.. భూగర్భ జలాల పెంపునకు దోహదపడే జలసిరి కార్యక్రమాల అమలుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ నెల 28న అన్ని మండలాల్లో మండలస్థాయి సభలు, 29, 30 తేదీల్లో గ్రామ పంచాయతీల స్థాయిలో గ్రామ సభలు నిర్వహించాలన్నారు. ఆయా సభల్లో ఎల్నినో ప్రభావం పరిస్థితులు, జల సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేలా వీబీ జీ – రామ్ – జీ పథకం కింద విరివిగా ఇంకుడుగుంతలు, ఊట కుంటలు, పంట కుంటలు, బోరు బావుల రీచార్జ్ నిర్మాణాలు చేపట్టి జాబ్కార్డు ఉన్న కూలీలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని అన్నారు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, ఏఈవోలు, వీవోలు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు ఇలా అందరినీ భాగస్వామ్యం చేస్తూ నిర్ణీత గడువులోగా జలసిరి కార్యక్రమాలు అమలయ్యేలా చొరవ చూపాలని ఆదేశించారు. ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు. వాటర్ షెడ్ నిర్మాణాల ద్వారా నీటి సంరక్షణ జరగడంతోపాటు కూలీలకు ఉపాధి కల్పించి పని దినాల లక్ష్యాన్ని సాధించవచ్చని సూచించారు. అదేవిధంగా వీవో భవన నిర్మాణ పనులను కూడా నవంబర్ 15వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో ట్రెయినీ కలెక్టర్ సురేశ్, డీఆర్వో గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆగస్టు 15వ తేదీ నాటికి గ్రామాల్లో అమలు కావాలి
ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత
తప్పనిసరిగా ఉండేలా చూడాలి
అధికారులతో అదనపు కలెక్టర్
భుజంగరావు


