● ఇద్దరు నిందితుల అరెస్ట్
● వివరాలు వెల్లడించిన
బోధన్ ఏసీపీ శ్రీనివాస్
రుద్రూర్: మండల కేంద్రంలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి ఐదు కిలోల గంజాయిని స్వా ధీనం చేసుకున్నట్లు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. రుద్రూర్లోని పోలీస్స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. రుద్రూర్ శివారులోని హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఈనెల 26న మధ్యాహ్నం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, మోటార్సైకిళ్లపై అనుమానాస్పదంగా వస్తున్న ఇద్దరిని ఆపి తనిఖీ చేశారు. ఒకరి వద్ద మూడు కిలోలు, మరొకరి వద్ద రెండు కిలోల గంజాయి లభ్యమైంది. మొత్తం ఐదు కిలోల గంజాయి, రెండు మోటార్సైకిళ్లు, రెండు మొబైల్ ఫోన్లను వారి నుంచి స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.50వేలుగా ఉంటుందని ఏసీపీ తెలిపారు. నిందితులు కోటగిరి మండలానికి చెందిన కర్కెల్లి సంజీవ్, బిహార్ రాష్ట్రానికి చెందిన బల్వంత్ కుమార్ సింగ్గా గుర్తించారు. బిహార్కు చెందిన రాహుల్ అనే వ్యక్తి నుంచి గంజాయిని తెప్పించుకుని, స్థానిక రైస్మిల్లుల్లో పనిచేసే హమాలీలకు విక్రయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. గంజాయి సరఫరా చేసిన రాహుల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. నిందితుల నుంచి గంజాయి కొనుగోలు చేసి వినియోగించిన ఏడుగురిపై కూడా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన సీసీఎస్ ఏసీపీ, చీతా ఫోర్స్, రుద్రూర్ సీఐతోపాటు పోలీసు సిబ్బందిని సీపీ అభినందించినట్లు పేర్కొన్నారు. రుద్రూర్ సీఐ కృష్ణ, ఎస్పైలు మనోజ్ కుమార్, శ్రీనివాస్, చీతాఫోర్సు ఎస్సై శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.


