వేల్పూర్(మెండోరా): మెండోరా మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో గల్లంతైన నలుగురిలో ఆదివారం ఆచూకీ లభించని అజీమ్ఖాన్ మృతదేహం సోమవారం లభించినట్లు మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు. నిజామాబాద్ ఆటోనగర్కు చెందిన అజీమ్ఖాన్(24)తోపాటు కలీం, సయ్యద్ నజవత్, మహారాష్ట్ర బోకర్కు చెందిన అర్హన్ అనే యువకులు ఆదివారం ఎస్సారెస్పీలో విహారయాత్రకు వచ్చి ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతైన విషయం విదితమే. వీరిలో కలీం, నజవత్, అర్హన్ మృతదేహాలు ఆదివారం రాత్రి లభించాయి. పూర్తిగా చీకటి పడడంతో సహాయక చర్యలు నిలిపివేశారు. తిరిగి సోమవారం గజ ఈతగాళ్లతో సహాయక చర్యలు చేపట్టి పోలీసులు మృతదేహాన్ని వెలికి తీయించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
మృతదేహాన్ని వెలికితీసిన
బెటాలియన్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది..
డిచ్పల్లి: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని లక్ష్మీ కెనాల్ బ్యాక్వాటర్స్ వద్ద యువకుడు గల్లంతు కావడంతో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) టీజీఎస్పీ బృందం సహాయక చర్యలను చేపట్టింది. ఏడో బెటాలియన్లోని 23 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక ఎస్డీఆర్ఎఫ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ (ఆర్ఎస్ఐ) రమేష్ నాయకత్వం, పర్యవేక్షణలో సవాలుతో కూడుకున్న బ్యాక్వాటర్ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టి, యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం స్థానిక అధికారులకు అప్పగించారు.


