● రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): రైతులను కష్టపెట్టే పని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ చేయదని, ఇది రైతు ప్రభుత్వమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి పేర్కొన్నారు. డిచ్పల్లి సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం యూరియా యాప్పై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సొసైటీలో నిల్వ ఉన్న యూరియా, ఇతర ఎరువులను పరిశీలించారు. సంబంధిత వ్యవసాయశాఖ అధికారులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. తానే స్వయంగా రైతుతో యూరియా యాప్లో ఎరువుల బస్తాలను బుకింగ్ చేయించి, యాప్తో తలెత్తే సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. స్మార్ట్ ఫోన్లు లేనివారు, పట్టా పాస్బుక్లు లేని అసైన్డ్, పోడు భూములున్న వారు యూరియా బుకింగ్ కాక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. అనంతరం ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ యూరియా అక్రమ రవాణాని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాప్ను ప్రవేశపెట్టిందని వివరించారు. యాప్లో సాంకేతిక కారణాలతో రైతులు కొంత ఇబ్బందులు పడుతున్నారని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతుల సమస్యలు ధైర్యంగా విని భరోసా కల్పించేందుకే ఇక్కడికి వచ్చానని.. చిత్తశుద్ధి లేకుంటే వచ్చేవాళ్లమే కాదన్నారు. కేంద్రం విధించిన పరిమితుల కారణంగా తెలంగాణకు యూరియా నిల్వలు రావడం లేదన్నారు. ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రైతులను రోడ్లపైకి వచ్చేలా రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సర్పంచ్ యాదగిరి, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్లు మునిపల్లి సాయరెడ్డి, తారాచంద్ నాయక్, డీసీసీ ఉపాధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ రాంచందర్గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ చింత శ్రీనివాస్రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వాసుబాబు, అంబర్సింగ్, డాక్టర్ షాదుల్లా, బూస సుదర్శన్, శాంతయ్య తదితరులు పాల్గొన్నారు.


