● వర్షాభావ పరిస్థితులపై రైతులు
అప్రమత్తంగా ఉండాలి
● పంటల ఎంపిక, సాగు పద్ధతులపై వ్యవసాయ శాఖ సూచన
డొంకేశ్వర్(ఆర్మూర్): వాతావరణ శాఖ అంచనా ప్రకారం జిల్లాపై ఎన్నినో ప్రభావం ఉందని, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నట్లు వ్యవసాయ శాఖ రైతులను అప్రమత్తం చేసింది. వర్షాలు ఆలస్యమైనా ఆందోళన చెందకుండా పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని, సాగు పద్ధతులను మార్చుకోవాలని సూచించింది. తద్వారా పంట నష్టాలను తగ్గించుకోవచ్చని జిల్లా వ్యవసాయాధికారి వీరాస్వామి ఒక ప్రకటన విడుదల చేశారు.
● జూన్లో సాధారణ వర్షపాతం నమోదై తర్వాత వర్షాలు నిలిచిపోయే అవకాశం ఉన్నందున పంటల ప్రణాళిక ముందే రూపొందించుకోవాలి. పొలాల్లో సేద్యపు కుంటలు ఏర్పాటు
చేసుకోవాలి.
● ముఖ్యంగా వరి సాగుకు బదులు నీటి ఎద్దటిని తట్టుకునే కంది, కొర్రలు, సజ్జలు లాంటి దిగుబడినిచ్చే పంటలను సాగు చేయాలి.
● జూలై 15 వరకు వర్షాలు లేకపోతే పొడి నెలల్లో తొందరపడి విత్తనాలు వేయొద్దు. తేలిక నేలల్లో 50–60 మి.మీ అలాగే బరువు నేలల్లో 60–70 మి.మీ వర్షపాతం నమోదైన తర్వాత ఏడు రోజుల్లోపే విత్తనాలు విత్తనాలి.
● పత్తి, మొక్కజొన్న, కంది పంటల్లో సాధారణ సాగు కొనసాగించొచ్చు. మొక్కల సంఖ్య తగ్గకుండా ఉండేందుకు 10 శాతం ఎక్కువ విత్తనాలు వేయాలి. మొలకలు రాని చోట వెంటనే తిరిగి విత్తాలి.
● నేలలో తేమ వచ్చే వరకు ఎరువుల వాడకం వాయిదా వేయాలి. అంతరకృషి ద్వారా నేల తేమను కాపాడుకోవాలి. 2 శాతం యూరియా, 1శాతం పొటాషియం నైట్రెడ్ ద్రవాన్ని 15 రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు పిచికారీ చేయాలి.
● జూలై 30 వరకు అలాగే ఆగస్టు 15 వరకు వర్షాలు కురవకపోతే అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించడానికి ఒక సాలు వదిలి ఒక సాలుకు తడులు ఇవ్వాలి. వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు బదులు కంది, సజ్జ, మొదలగు పంటలు వేసుకోవాలి.


