కమ్మర్పల్లి/ బోధన్/ ఆర్మూర్ : ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన వాగ్ధానలను అమలు చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. కమ్మర్పల్లి, బోధన్, ఆలూర్ ఆర్డీవో, తహసీల్ కార్యాలయాల ఎదుట బుధవారం అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు రాతపూర్వకంగా ఇచ్చిన స్వామినాథన్ కమిషన్ సి ఫారసులను అమలు చేయడంతోపాటు పంటలకు మద్దతు ధరల చట్టం బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ పై సరఫరా చేయాలన్నారు. పంట రుణాలను మా ఫీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం మేరకు మూతపడిన నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని పేర్కొన్నారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కమ్మర్పల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సారా సురేశ్, నాయకులు బాలయ్య, కిషన్, లింబ నాయక్, లింబన్న, రమేశ్, మలావత్ లింబన్న, స్వప్న, శిరీష, నర్సు, లక్ష్మి, గౌరీ తదితరులు పాల్గొన్నారు. బోధన్లో రాష్ట్ర కమిటీ సభ్యుడు గుమ్ముల గంగాధర్, డివిజన్ ప్రతినిధులు పుట్టనడ్పి నాగన్న, పార్వతి రాజేశ్వర్, కాశ రవి, శ్రీపతి మల్లేశ్, సిద్ధ పోశెట్టి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఆలూర్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దేవరాం, జిల్లా ఉపాధ్యక్షుడు యూ.రాజన్న, ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు జే.శేఖర్, జిల్లా కార్యదర్శి కిషన్, నాయకులు పస్క నాగేశ్వర్, ఉంగరాల జగదీశ్వర్, ఉంగరాల రాములు, గంగారం తదితరులు పాల్గొన్నారు.


