ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలోని గోల్బంగ్లా వద్ద గల పట్టు చేనేత సహకార సంఘానికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనట్లు పట్టు చేనేత సంఘం అధ్యక్షుడు మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా సిల్క్ సొసైటీకి చెందిన సభ్యుల వివరాలతో ప్రత్యేకంగా బుక్లెట్ రూపొందించినట్లు వెల్లడించారు. సంఘంలో మెంబర్షిప్కు రూ.400 చెల్లించాలని, గతంలో వాటాధనం(మెంబర్షిప్ కోసం) తక్కువగా చెల్లించిన వారు రూ. 400 చెల్లించి, ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హత పొందవచ్చని తెలిపారు. ఇందుకోసం ఈనెల 10లోపు సాయంత్రం 5 గంటలలోపు పట్టు చేనేత సహకార సంఘంలో సంప్రదించాలన్నారు. మరింత సమాచారం కోసం 94408 99089, 94922 11210 సంప్రదించాలన్నారు.
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థిని అమల పీహెచ్డీ డాక్టరేట్ సాధించారు. తెయూ రసాయనశాస్త్ర విభాగం అధ్యాపకుడు నాగరాజు పర్యవేక్షణలో ‘డిజైన్ అండ్ సింథసిస్ అఫ్ నైట్రోజెన్ అండ్ సల్ఫేర్ బేస్డ్ హేతేరోసైకిల్స్ యాజ్ పోతేంటిల్ ఏంటిమైక్రోబియల్ ఏజెంట్స్’ అనే అంశంపై అమల పరిశోధన పూర్తి చేసి సిద్ధాంత గ్రంథం సమర్పించారు. మంగళవారం నిర్వహించిన ఓపెన్ వైవా–వోస్కు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రాంచందర్ ఎక్స్టర్నల్ ఎగ్జామినర్గా వ్యవహరించి, అమలను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. సైన్స్ డీన్ సంపత్కుమార్, విభాగాధిపతి సాయిలు, బీవోఎస్ చైర్మన్ నాగరాజు, అధ్యాపకులు బాలకిషన్, గంగాకిషన్, నాగేశ్వరరావు, రాజేశ్వరి, డేనియల్, సురేష్, అపర్ణ, నాగేంద్రబాబు, రఘువీర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ఖలీల్వాడి: నగరంలోని దుబ్బాలోగల జీజీ కళాశాలలో డిగ్రీ 4వ, 6వ సెమిస్టర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయినట్లు ప్రిన్సిపల్ రాంమోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 1163 విద్యార్థులకు గాను 18 మంది గైర్హాజరయ్యారని, 1145 మంది విద్యార్థులు హాజరయ్యారు. 5వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలు 60 మంది రాశారని పరీక్షల నియంత్రాధికారి భారత్ రాజ్ తెలిపారు.
ఆర్మూర్: ఆర్మూర్కు చెందిన డాక్టర్ శ్రీలత బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలందిస్తూ ఉత్తమ గైనకాలజిస్టుగా రెండో పర్యాయం అవార్డును అందుకున్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో సోమవా రం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ఆమె అవార్డును అందుకున్నారు. ఆర్మూర్ ఆస్పత్రి బృందం, సంజీవని ఆస్పత్రి బృందం ఈ సందర్భంగా ఆమెను అభినందించారు.
ఆర్మూర్టౌన్: జిల్లా సహకార బ్యాంకు వ్యాపార లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకోవడంలో ఖాతాదారులు తమపై ఉంచిన నమ్మకమే కీలమైందని జిల్లా ఎన్డీసీసీ బ్యాంకు సీఈవో నాగభూషణం వందే అన్నారు. ఆర్మూర్లోని ఎన్డీసీసీ బ్యాంకు 2026 మార్చి 31 వరకు రూ. 100 కోట్ల వ్యాపారాన్ని పూర్తి చేసిన సందర్భంగా మంగళవారం బ్యాంకులో వేడుకలు నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకు సిబ్బంది, ఖాతదారులను సమన్వయం చేసుకుంటు లక్ష్యాన్ని పూర్తి చేయడం అభినందనీయన్నారు. డిపాజిట్ సేకరించడంలో ఆర్మూర్ బ్యాంకు ముందుందన్నారు. నాబార్డ్ డీడీఎం ప్రవీణ్కుమార్, జీఎం అనుపమ, డీజీఎం లింబాద్రి, ఏజీఎం సుమన్, బ్రాంచ్ మేనేజర్ సందీప్శర్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పీఎస్ పరిధిలో ఇటీవల పోలీసులు డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా పలువురు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. పోలీసులు మంగళవారం ఎనిమిది మందికి ఆర్మూర్ కోర్టులో హాజరుపర్చగా, జడ్జి ఏడుగురికి రూ.10వేల చొప్పున జరిమానా విధించగా, ఒకరికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు.


