నిజామాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పేదలను నట్టేట ముంచి, సకల జనులనూ నిరాశలో నెట్టేసేలా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్పై ఆయన శనివారం నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మాట్లాడారు. ఆరు గ్యారంటీల పేరిట గద్దెనెక్కి.. రైతుల్ని, గల్ఫ్ బాధితుల్ని నట్టేట ముంచారని ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. బడ్జెట్లో గల్ఫ్ బాధితులకు చిల్లిగవ్వ కేటాయించకపోవడం వారికి ద్రోహం చేయడమేనన్నారు. సీఎం రేవంత్రెడ్డి రూ.300 కోట్లు వెచ్చించి మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించలేరా అని నిలదీశారు. మూసీ రివర్కు రూ. 1,500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఎందుకు కేటాయించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర పిలుపుమేరకు ఈనెల 23న ఉదయం కలెక్టరేట్ ముట్టడి చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి జిల్లాలోని పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొతన్కార్ లక్ష్మీనారాయణ, ఓంసింగ్ నాయ క్, పుట్ట వీరేందర్, బొబ్బిలి వేణు, ఇందూర్ సుధా, గడ్డం రాజు, అంబదాస్ రావు, ఆనంద్, విజయ్, కృష్ణ, బుల్లెట్ శీను తదితరులు పాల్గొన్నారు.
ఆరు గ్యారంటీలను పాతరేసిన
కాంగ్రెస్ ప్రభుత్వం
23న కలెక్టరేట్ను ముట్టడిస్తాం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు
దినేశ్ పటేల్ కులాచారి


