పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్
నిజామాబాద్ అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్లాల్ సమక్షంలో గురువారం నిర్వహించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ జరిపించారు. ఈ ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్ నిశితంగా పరిశీలించారు. ఒక్కో మండలం వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేశారు. డీపీవో శ్రీనివాస్ రావు, జెడ్పీ డిప్యూటీ సీఈవో సాయన్న, నోడల్ అధికారి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


