
సిర్పూర్ కాగజ్నగర్లో రుద్రూర్వాసి మృతి
రుద్రూర్: మండల కేంద్రానికి చెందిన కర్రోళ్ల శ్రీనివాస్ (53) అనే వ్యక్తి గురువారం కుమురం భీం జిల్లా సిర్పూర్ కాగజ్నగర్ రైల్వేస్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు రైలు కింద పడి దుర్మరణం చెందినట్టు స్థానికులు తెలిపారు. కూలి పని నిమిత్తం పది రోజుల క్రితం వెళ్లిన శ్రీనివాస్ మృతి చెందాడన్న సమాచారం తెలుసుకున్న బంధువులు సిర్పూర్ కాగజ్నగర్కు బయల్దేరి వెళ్లారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
గాంధారి శివారులో మృతదేహం
గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్ర శివారులోని గాంధారి–చద్మల్ రహదారి పక్కన గుంతలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గురువారం లభించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. రైతుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి మృతదేహాన్ని పరిశీలించారు. దుండగులు గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి పెట్రోలు పోసి దహనం చేసినట్లు తెలుస్తోంది. మృతదేహం పాక్షికంగా దహనం అయింది. సదాశివనగర్ సీఐ సంతోష్ కుమా ర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్స్క్వాడ్ను రప్పించి విచారణ చేశారు. మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 30–35 ఏళ్ల మధ్య ఉంటుందని, నీలిరంగు జీన్ ప్యాంటు, తెల్లని బనియన్, నల్లచారలు కల్గిన తెల్లచొక్కా ధరించి ఉన్నాడు. సంబంధీకులు ఎవరైనా 8712686165, 8712686163 నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని తెలిపారు.
తిరుమలయ్య ఆలయంలో చోరీ
ఇందల్వాయి: నల్లవెల్లి గ్రామంలోని తిరుమలయ్య స్వామి ఆలయంలో బుధవారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. 6 గ్రాముల బంగారు, 4 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు ఎస్సై సందీప్ కుమార్ తెలిపారు. వీడీసీ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తాళం వేసిన ఇంట్లో ..
నిజామాబాద్ రూరల్: మండలంలోని గుండారం గ్రామంలో తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడిన ఘటన గురువారం వెలుగుచూసింది. రూరల్ ఎస్హెచ్వో మహ్మద్ ఆరీఫ్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండారం గ్రామానికి చెందిన స్వర్గం లక్ష్మి అదే గ్రామంలోని బంధువుల ఇంట్లో బుధవారం రాత్రి నిద్రించింది. ఇదే అదనుగా భావించిన దుండగులు లక్ష్మి ఇంటి తాళం పగులగొట్టి 2 గ్రాముల బంగారం, 10 తులాల వెండి అపహరించారు. అయితే, చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు.
నిజామాబాద్ అర్బన్: నగరంలోని దుబ్బ ప్రాంతంలో అనుమతి లేకుండా టపాకాయలు విక్రయిస్తున్న దుకాణంపై మూడో టౌన్ పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు కలిసి గురువారం దాడులు చేశారు. రూ. మూడు లక్షల విలువచేసే 29 రకాల టపాకాయలను సీజ్ చేసినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. నిబంధనలు పాటించకుండా రాఘవ ఉపాధ్యా య అనే వ్యక్తి టపాకాయలు విక్రయిస్తున్నట్లు వారు తెలిపారు. కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.