
ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
● అధికారుల అలసత్వంపై ఆగ్రహం
నిజామాబాద్అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించేలా క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. లక్ష్య సాధనకు కృషి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, డబుల్ బెడ్రూంల పంపిణీ ప్రక్రియపై కలెక్టర్ గురువారం ఎంపీడీవోలు, ఎంపీవోలు, హౌసింగ్ ఏఈలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సుదీర్ఘ సమీక్ష జరిపారు. మండలాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాలలో వెనుకంజలో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తూ, నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నప్పటికీ, ఎందుకు పురోగతి సాధించడం లేదని మండిపడ్డారు. మంజూరీలు పొందిన వారందరూ తక్షణమే ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా లబ్ధిదారులను ప్రోత్సహిస్తూ, క్షేత్రస్థాయిలో పక్కాగా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఉచిత ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని సూచించారు. సమీక్షలో ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, జెడ్పీ డిప్యూటీ సీఈవో సాయన్న తదితరులు పాల్గొన్నారు.
సర్వేలో భాగస్వాములు కావాలి
రానున్న రోజులలో రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభు త్వం తెలంగాణ రైజింగ్ విజన్–2047 అంశాలతో డాక్యుమెంటును రూపొందిస్తోందని, ఈ సర్వేలో ఉద్యోగులు, అన్నివర్గాల వారు భాగస్వాములు కావాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ విజన్ 2047 డాక్యుమెంట్ తయారీలో ప్రతి ఒక్క పౌరుడు పాల్గొనేలా సిటిజన్ సర్వే చేపట్టారన్నారు. ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగే సర్వేలో ఉద్యోగులు పాల్గొనడంతోపాటు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. జిల్లా పౌరులు http//www.telangana.gov.in/ telanganarising/ అనే లింక్ ద్వారా సర్వేలో పాల్గొనాలని కలెక్టర్ కోరారు.