
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
బోధన్: వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని సబ్ కలెక్టర్ వికాస్ మహతో అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలోని వార్డులు, గ్రామ పంచాయతీల పరిధిలో ఎక్కడా వర్షం, మురికినీరు నిల్వ ఉండకుండా చూడాలని, పారిశుధ్య నిర్వహణకు సంబంధించిన పనులు చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యల్లో భాగంగా పట్టణంలోని తన కార్యాలయంలో శుక్రవారం వివిధ శాఖల డివిజన్, మండల అధికారులు, ఉద్యోగులతో కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ వారితో మాట్లాడుతూ.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మలేరియా, డెంగీ ప్రబలే హాట్ స్పాట్ పాయింట్లను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా, డెంగీ వ్యాధుల నిర్ధారణ కిట్లు, పాముకాటు, ఇతర సీజనల్ వ్యాధులను నియంత్రించే మందులను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్యరక్షణ చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సమత, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, డీఎల్పీవో నాగరాజు, ఎంఈవో నాగయ్య, ఉద్యోగులు పాల్గొన్నారు.
నీరు నిల్వకుండా
జాగ్రత్తలు తీసుకోవాలి
గత అనుభవాలను దృష్టిలో
పెట్టుకొని చర్యలు చేపట్టాలి
కో ఆర్డినేషన్ సమావేశంలో
బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో