
విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి చారిత్రక నిర్ణయం
● సీఎం, డిప్యూటీ సీఎంలకు కృతజ్ఞతలు తెలిపిన ఈఈ జేఏసీ
సుభాష్నగర్: విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి రూ.కోటి గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ను మంజూరు చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎన్పీడీసీఎల్ వరుణ్రెడ్డికి ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఈఈ జేఏసీ) ప్రతినిధులు మంగళవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న లైన్ సిబ్బంది, ఫీల్డ్ వర్కర్ల త్యాగాలను గుర్తించి తీసుకున్న ఈ నిర్ణయం ప్రజా అభిముఖ ప్రభుత్వాన్ని ప్రతిబింబిస్తుందని కొనియాడారు. మరింత నిబద్ధతతో విధులు కొనసాగిస్తామని నిజామాబాద్ ఈఈ జేఏసీ, ఉద్యోగ సంఘాలు, ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులు బీ రఘునందన్, శ్రీనివాస్, తోట రాజశేఖర్, ఆర్ మల్లేశ్, బీ సురేశ్, కే రాజేందర్ తదితరులు పేర్కొన్నారు.
సజ్జ సీడ్ ఆర్గనైజర్ల నిలదీత
బాల్కొండ: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ఎందుకు కొనుగోలు చేయరని ముప్కాల్ మండలం నాగంపేట్, రెంజర్ల గ్రామ రైతులు సీడ్ ఆర్గనైజర్లను మంగళవారం నిలదీశారు. ఇటీవల కురిసిన వర్షాలతో తడిసిన సజ్జను సీడ్ కంపెనీల ఆర్గనైజర్లు పరిశీలించేందుకు వచ్చారు. దీంతో కంపెనీ పెట్టిన నిబంధనలతోనే పంటకు నష్టం వాటిల్లిందని రైతులు ఆరోపించారు. 85 రోజుల్లో కోత కోసే పంటను 90 రోజులకు వరకు కోత కోయనివ్వకుండా చేయడంతోనే వర్షాలు కురిసి నష్టపోయామన్నారు. రైతులకు న్యాయం చేయకుంటే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
‘ఈ–శ్రమ్’లో పేర్లు నమోదు చేసుకోవాలి ●
● కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ యాదయ్య
నిజామాబాద్ రూరల్: అసంఘటిత రంగ కార్మికులు తమ వివరాలను ‘ఈ–శ్రమ్’ పోర్టల్లో నమోదు చేసుకోవాలని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ యాదయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అసంఘటిత కార్మి కులు, గిగ్ వర్కర్లు ఈ–శ్రమ్లో నమోదు చేసుకుంటే రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. పనిచేసే ప్రదేశాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వ పరంగా సహాయం అందుతుందని తెలిపారు. సమావేశంలో అధికారులు పలనాటి యోహాన్, ప్రభుదాస్, కమురుద్దీన్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి చారిత్రక నిర్ణయం