
పప్పు, నూనె గింజ పంటలతో అధిక లాభాలు
రుద్రూర్ : పప్పు ధాన్యాలు, నూ నె గింజ పంటల సాగుతో అధిక లాభాలను అర్జించవచ్చునని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్కుమార్ సూచించారు. పొతంగల్ మండలం హెగ్డోలిలో గురువారం నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వరి, సోయా, మొక్కజొన్న పంటల్లో తీసుకోవాల్సిన సమగ్ర సస్యరక్షణ విధానాలను వివరించారు. ఒకే రకమైన పంట వేయడంతో భూములు చౌడు బారిపోతున్నాయని, దీని నివారణకు పంట మార్పిడి చేయాలన్నారు. తక్కువ కాల పరిమితి రకాలను ఎంపిక చేసుకోవడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చునని తెలిపారు. వ్యవసాయ సమాచార సాధానాలపై విస్తరణ శాస్త్రవేత్త శ్వేత అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారిణి నిశిత, వెటర్నరీ డాక్టర్ సురేశ్కుమార్, ఏఎంసీ చైర్మన్ హన్మంతు, మాజీ ఎంపీపీ పుప్పాల శంకర్, రైతులు పాల్గొన్నారు.