భైంసాటౌన్: తమతో చదువుకున్న విద్యార్థిని కుటుంబానికి పెద్ద ఆపద రావడంతో ఆమె కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు పూర్వ విద్యార్థులు. భైంసా పట్టణంలోని సంతోషిమాత నగర్కు చెందిన విజయకు ఇద్దరు పిల్లలు. ఇద్దరూ అటిజంతో బాధపడుతున్నారు. మూడేళ్లు చికిత్స అందించాల్సి ఉంటుందని, దీనికి పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు పేర్కొన్నారు. నిరుపేద కుటుంబం కావడంతో, విషయం తెలుసుకున్న తోటి పూర్వ(2004–05 సరస్వతి శిశుమందిర్ పదో తరగతి) విద్యార్థులు 30 మంది ఆమె కుటుంబానికి అండగా నిలిచారు. ఆదివారం విజయ నివాసానికి చేరుకుని మొదటి ఏడాది చికిత్స కోసం రూ.1.40 లక్షలు అందజేశారు. దాతల ద్వారా మరింత ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు.


