నిర్మల్చైన్గేట్: గ్రామీణ ప్రజలకు తొలి వైద్య ఆశ్రయంగా నిలిచే ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు (పీహెచ్సీలు) నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఏటా ఆస్పత్రుల నిర్వహణ, చిన్నచిన్న మరమ్మతులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ బిల్లులు, ఫ ర్నిచర్, అత్యవసర ఔషధాల కొనుగోలు తదితర అ వసరాలకు ఇవ్వాల్సిన హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ (హెచ్డీఎఫ్) సమయానికి విడుదల కాకపోవడంతో పీహెచ్సీల పరిస్థితి దయనీయంగా మారింది. నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో ఏటా హెచ్డీఎఫ్ విడుదల చేయడంలో నిర్లక్ష్యం నెలకొనడంతో పేదల వైద్యసేవలపై ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది. మూడేళ్లుగా ప్రతిపాదనలు పంపించినా నిధులు విడుదల కావడం లేదు. దీంతో ప్రతీ చిన్న పనికీ దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వసతులు సమకూర్చుకునేందుకు వై ద్యులు, సిబ్బంది తంటాలు పడుతున్నారు. వైద్య పరికరాలు మరమ్మతుకు నోచుకోవడం లేదు. రోగులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. ఔషధాల కొరత, ల్యాబ్ పరీక్షలు, విద్యుత్, తాగునీటి బి ల్లుల భారం, పారిశుద్ధ్యంపై ప్రభావం పడుతోంది. ఫలి తంగా మందులు, పరీక్షలు, సౌకర్యాలు లేక ప్రభు త్వ వైద్యంపై నమ్మకం సన్నగిల్లి రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన దుస్థితి ఎదురవుతోంది.
మూడేళ్లుగా పెండింగ్లో
రూ.90లక్షలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణకు కేంద్రం ఆర్థిక చేయూతను అందిస్తోంది. ఒక్కో పీహెచ్సీకి రూ.1.50 లక్షలు చొప్పున నిధులు మంజూరు చేస్తోంది. జిల్లాలో 17 పీహెచ్సీలు, మూడు యూపీహెచ్సీలున్నాయి. ఈ లెక్కన 20 కేంద్రాలను తీసుకుంటే ఏడాదికి రూ.30లక్షల చొప్పున మూడేళ్లకు రూ.90 లక్షల నిధులు విడుదల కావాల్సి ఉంది. అయితే, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిశీలనకు వచ్చిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లభించడం లేదు.


