ముధోల్: ఉపాధిహామీ పథకం కింద పానాది రోడ్ల నిర్మాణం చేపట్టాలని పలుసార్లు చెప్పినా అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడం సరికాదని ఎమ్మెల్యే రామారావుపటేల్ పేర్కొన్నారు. బుధవారం ముధోల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అన్ని మండలాల ఉపాధిహామీ అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ప్రతీ మండలానికి రోడ్ల నిర్మాణానికి రూ.కోట్లాది నిధులు మంజూరైనా టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్లక్ష్యం ప్రదర్శించడం సరికాదన్నారు. కొన్ని గ్రామాల్లో రోడ్ల పనులు పూర్తి చేయించిన అధికారులను ఈ సందర్భంగా అభినందించారు. రెండేళ్లుగా పానాది రోడ్లపై దృష్టి పెడితే 25శాతం పనులే పూర్తయ్యాయని.. 15 రోజుల్లోనైనా గ్రావెల్ రోడ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ కింద రూ.కోట్లాది నిధులు మంజూరు చేస్తోందని చెప్పారు. ఇప్పటివరకు ఎన్ని పనులు పూర్తి చేశారు? మిగతా పనుల పరిస్థితిపై తనకు సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా సూచించారు. డీఆర్డీవో విజయలక్ష్మి పాల్గొన్నారు.


