కుంటాల: కుంటాలకు చెందిన గుద్దేటి హన్మండ్లు బతుకుదెరువు కోసం 14 ఏళ్ల క్రితం ఇరాక్ వెళ్లాడు. ఇరాన్–ఇరాక్ సరిహద్దు ప్రాంతంలో వెస్ట్ కుర్న–2 ప్రైమ్ సపోర్ట్ జనరల్ సర్వీస్ క్యాంప్ కార్యాలయంలో మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆర్నెళ్లకు ఒకసారి ఇండియాకు వచ్చి వెళ్లేందుకు కంపెనీ అతనికి వీలు కల్పించింది. ఈ కంపెనీలో 400 మంది భారతీయులు విధులు నిర్వహిస్తున్నారు. పశ్చిమాసియాలో అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్ దాడి చేయడంతో ఆయా దేశాల్లో ఉన్న భారతీయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో భారత రాయబారి కార్యాలయం పటిష్ట చర్యలు చేపట్టింది. 50 మందిని 8 విడతల్లో భారత్కు పంపించేందుకు కంపెనీ నిర్ణయించింది. ప్రయాణ ఖర్చులు కూడా కంపెనీ భరించింది. కుంటాలకు చెందిన గుద్దేటి హన్మండ్లు ఉండే ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఇరాన్ డ్రోన్ బాంబు ప్ర యోగించింది. దీంతో ఇరాక్ విమానాశ్రయం మూ సివేయడంతో అక్కడి రాయబార అధికారులు చర్యలు చేపట్టారు. అధికారుల సూచన మేరకు తుర్కి యా వీసా తీసుకుని ఇరాక్ నుంచి తుర్కీబన్ వరకు రోడ్డు మార్గం ద్వారా రెండు రోజులపాటు ప్రయాణించి సౌదీ చేరుకున్నాడు. అక్కడి నుంచి ముంబై, ఆ తర్వాత కుంటాలకు క్షేమంగా చేరుకున్నాడు.
మరుసటి రోజే పేలిన బాంబు..
మార్చి 30న ఇరాక్ నుంచి బయలుదేరిన హన్మండ్లు ఈనెల 4న ఇంటికి చేరుకున్నాడు. ఈనెల 5న తను పని చేస్తున్న కంపెనీపై డ్రోన్ బాంబుదాడిజరిగింది.
భయం భయంగానే విధులు..
యుద్ధం జరగడంతో భయం భయంగానే విధులు నిర్వర్తించా. మేము పనిచేస్తున్న కొన్ని కిలోమీటర్ల దూరంలో డ్రోన్ బాంబు ప్రయోగించారు. కంపెనీ 50 మంది చొప్పున ఇండియాకు పంపేందుకు చర్యలు చేపట్టింది. నావంతు రావడంతో ఇంటికి వచ్చా. మరుసటి రోజే మా కంపెనీపై ఇరాన్ బాంబు ప్రయోగించింది. దీంతో ఊపిరి పీల్చుకున్నా.
– హన్మండ్లు, కుంటాల


