ఉట్నూర్రూరల్: గిరిజన గ్రామాల్లో పర్యటించి గిరిజనుల జీవన స్థితిగతులను పరిశీలిస్తున్న డిప్యూటీ కలెక్టర్ల బృందం సభ్యులు శనివారం పీఎంఆర్సీలో టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఉట్నూర్ మండలంలోని కామాయిపేటలో పర్యటించారు. కొలాం గిరిజనులతో మాట్లాడి తాగునీరు, విద్యుత్, వర్షాకాలంలో ఎదుర్కొనే రవాణా సౌకర్యాలతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధానమంత్రి జన్ మన్, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ద్వారా గిరిజనులకు అందుతున్న లబ్ధి వివరాలు తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోడ్లు సరిగ్గా లేకపోవడంతో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయా గ్రామాల ప్రజలు సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీ భవనాలు, పాఠశాలలు పరిశీలించారు. పీవీటీజీ కొలాం గిరిజన విద్యార్థులతో మాట్లాడి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో బాలికలకు రక్తహీనతను తగ్గించిన పోషక విలువ గల మోవలడ్డు ఆదివాసి ఆహారం పరిశ్రమను సందర్శించి, మోవలడ్డు రుచి చేసి చాలా బాగుందని నిర్వాహకులను అభినందించి, కొనుగోలు చేశారు.


