మాల్దా: న్యాయాధికారులను నిర్బంధించిన ఘటనకు బాధ్యులైన నేరగాళ్లు తప్పించుకుపోగా, దర్యాప్తు అధికారులు అమాయకులైన స్థానికులను వేధిస్తున్నారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. మాల్దా జిల్లా మోతాబరిలో బుధవారం రాత్రి న్యాయాధికారులను గంటలపాటు నిర్బంధించిన ఘటనపై ఎన్ఐఐ దర్యాప్తు చేపట్టడం తెల్సిందే.
శనివారం సీఎం మమత మాల్దాలోని మానిక్చక్లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్), ఎంఐఎంలనుద్దేశించి పరోక్షంగా ఆమె.. ‘జడ్జీలను ఘెరావ్ చేసిన ఆ రెండు మత పార్టీల వాళ్లు తప్పించుకుపోయారు. ఎన్ఐఏ అధికారులు విచారణ పేరుతో స్థానికులను వేధిస్తున్నారు. సుమారు 50 మందిని అదుపులోకి తీసుకున్నారు’అని ఆరోపించారు.
సర్లో పేర్ల తొలగింపునకు గురైన వారు న్యాయాధికారుల దగ్గరికి వెళ్లవద్దని, ఓటరు జాబితాలో తిరిగి తమ పేర్లను చేర్చాలంటూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు కోల్పోయిన వారిని చేతులెత్తాలని ఆమె కోరగా సభలో పాల్గొన్న చాలా మంది స్పందించడంపై విస్మయం వ్యక్తం చేశారు. ‘ఓటరు జాబితాలో పేర్లు లేని వారిని ట్రిబ్యునళ్ల వద్దకు వెళ్లేలా చేయడమే మా కర్తవ్యం’అని అన్నారు.


