ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 459 పాకిస్తానీ రూపాయలకు చేరడంతో సామాన్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరల పెంపుతో రావల్పిండి, ఇస్లామాబాద్లలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తక్షణమే పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పెట్రోల్ ధరల పెంపు ప్రభావం స్థానిక మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. రవాణా భారం పెరగడంతో కూరగాయలు, గోధుమ పిండి, మాంసం వంటి నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగాయి. ఆటో, రిక్షా ఛార్జీల మోతతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. స్కూల్ వ్యాన్ నిర్వాహకులు సైతం నెలవారీ ఫీజులను రూ.1,000 మేర పెంచేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రావల్పిండి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఆర్సీసీఐ) అధ్యక్షుడు ఉస్మాన్ షౌకత్ మాట్లాడుతూ.. రవాణా ఖర్చులు రెట్టింపు అయ్యాయని, దీనివల్ల ఆహార, నిర్మాణ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతున్నదన్నారు. అంతర్జాతీయ మార్కెట్తో సంబంధం లేకుండా, ప్రభుత్వమే లీటర్పై రికార్డు స్థాయిలో రూ.160.61 పన్ను విధిస్తోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే అనవసర ఖర్చులు తగ్గించుకుని, పన్నుల భారం ప్రజలపై పడకుండా ఐఎంఎఫ్ (ఐఎంఎఫ్)తో చర్చలు జరపాలని ఆయన సూచించారు.
మరోవైపు రాజకీయ పక్షాలు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాయి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేతలు సఫ్దార్ అలీ అబ్బాసీ, నహీద్ ఖాన్ ఈ పెంపును ‘ఆర్థిక అణచివేత’గా అభివర్ణించారు. సామాన్య, కార్మిక వర్గాల జీవన ప్రమాణాలను ఇది తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటున్న నేపథ్యంలో పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మోసిన్ నఖ్వీ ఒక ప్రకటన చేశారు. ప్రధాని ఆదేశాల మేరకు ఇస్లామాబాద్లో 30 రోజుల పాటు ప్రయాణికులందరికీ ఉచిత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: 345 మంది భారత మత్స్యకారులకు ఊరట


