ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క పూజారి సిద్దబోయిన రాణా రమేశ్ కుమారుడు ఏడేళ్ల యువిన్ రెండు కాళ్లపై ఇటీవల గద్దెల ప్రాంగణంలో రాతిశిల పడటంతో తీవ్ర గాయాలుకాగా, శుక్రవారం వైద్యులు ఎడమకాలిని తొలగించారు. వారం రోజులక్రితం యువిన్ గద్దెల ప్రాంగణం వద్దకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లగా సారలమ్మ గద్దె వద్ద ఓ రాతిశిల బాలుడి కాళ్లపై పడింది. దీంతో రెండు కాళ్లు విరిగిపోగా, వెంటనే కుటుంబ సభ్యులు హనుమకొండలోని గార్డియన్ హాస్పిటల్కి తరలించారు.
ఎడమ కాలికి శస్త్రచికిత్స నిర్వహించినప్పటికి బాగుకాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో వైద్యులు కాలుని తొలగించారు. కుడి కాలికి సర్జరీ చేసి రాడ్డు వేశారు. ఇటీవల సీతక్క బాలుడిని పరామర్శించి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మేడారం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో బాలుడికి సంబంధించి వైద్య ఖర్చులతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


