
జెడ్పీటీసీ గరిష్ట ఖర్చు రూ.4 లక్షలు
కై లాస్నగర్: స్థానిక రిజర్వేషన్లు ఖరారు కావడంతో పల్లె రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆశావహులు సై అంటున్నారు. ఆ దిశగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గెలుపే లక్ష్యంగా లక్షలను గుమ్మరించేందుకు రెడీ అవుతున్నారు. అయితే సదరు అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితిని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం– 2018లోని సెక్షన్ 237 ప్రకారం ఏ ఎన్నికలో ఎంత ఖర్చు చేయాలనే వివరాలు వెల్లడించింది. జిల్లా ప్రజాపరిషత్ సభ్యుడు (జెడ్పీటీసీ)గా పోటీచేసే వారు గరిష్టంగా రూ.4లక్షలు, మండల ప్రజా పరిషత్ (ఎంపీటీసీ) అభ్యర్థులు రూ.1.50 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థి చేసే గరిష్ట ఎన్నికల ఖర్చుల వివరాలను సైతం నిర్దేశించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 5వేలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా కలిగి ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు రూ. 2.50 లక్షలు, 5వేల కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో రూ.1.50 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక వార్డు మెంబర్లు 5వేలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలలో రూ.50వేలు, అంత కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో రూ.30వేలను ఈసీ నిబంధనలకు అనుగుణంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.