
వరదల నివారణకు చర్యలు తీసుకోండి
● మంత్రి ‘పొంగులేటి’ ఆదేశం
నిర్మల్చైన్గేట్: వర్షాకాలం నేపథ్యంలో వరదల కారణంగా జరిగే నష్టాన్ని నివారించేందుకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి కృష్ణ, గోదావరి నదుల పరీవాహక జిల్లాల కలెక్టర్లతో గురువారం సమీక్ష నిర్వహించారు. సాధారణం కన్నా అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని శాఖ లు సమన్వయంతో పనిచేసి వరదలతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. భారీ వర్షాలు, వరదలతో తలెత్తే ఏమైనా సమస్యలు, నివేదికలను తక్షణమే ప్రభుత్వానికి అందజేయాలన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లాలో గతంలో సంభవించిన వరదలపై అధ్యయనం చేసి ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించామని తెలిపారు. ఎలాంటి అపాయాలు లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి దష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్మిట్టల్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాల్గొన్నారు.