
అద్దె భవనాలు.. అరకొర సిబ్బంది..
● ఇదీ జిల్లాలో పశువైద్యశాలల పరిస్థితి ● మూగజీవాలకు అందని వైద్యం ● ఇబ్బంది పడుతున్న పశు పోషకులు
మామడ: జిల్లాలోని 19 మండలాల పరిధిలో పశువులకు వైద్య సేవలు అందించేందుకు 3 ఏరియా పశు వైద్యశాలలు (నిర్మల్, ఖానాపూర్, ముధోల్), 29 పశువైద్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 15 పశువైద్య ఉపకేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో 1,31,866 మేకలు, 5,02,576 గొర్రెలు, 1,77,954 ఆవులు–ఎద్దులు, 1,19,073 గేదెలు, 2,77,266 దేశీ కోళ్లు ఉన్నాయి. అయినా సౌకర్యాలు, సిబ్బంది కొరత పశువైద్య సేవలను దెబ్బతీస్తున్నాయి.
సొంత భవనాలు లేక..
బాసర, అస్టా, కల్లూర్, దస్తూరాబాద్ గ్రామాల్లో పశు వైద్యశాలలు ఉన్నా సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లో లేదా ఇతర శాఖల భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఈ గ్రామాల్లో పశువైద్యశాలల నిర్మాణానికి రూ.25 లక్షలు, పశువైద్య ఉపకేంద్రాల నిర్మాణానికి రూ.16 లక్షల నిధుల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపినా మంజూరు కాక అరకొర సౌకర్యాలతో సేవలు అందిస్తున్నారు. కొన్నిచోట్ల సొంత భవనాలు ఉన్నా, ప్రహరీ గోడలు, టాయిలెట్ సౌకర్యాలు లేక సిబ్బంది, పశుపోషకులు ఇబ్బందిపడుతున్నారు.
సిబ్బంది కొరత..
జిల్లాలోని 47 పశువైద్య కేంద్రాల్లో 103 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 28 పశువైద్య పోస్టులకు 22 మంది మాత్రమే పనిచేస్తున్నారు. భైంసా, ఇలేగాం, బీర్నంది, లోకేశ్వరం, బోసి తదితర 6 కేంద్రాల్లో పశువైద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొరిటికల్లో పశువైద్యశాల ఉన్నప్పటికీ, పశువైద్యాధికారి పోస్టు మంజూరు కాకపోవడంతో కంపౌండర్ పశువులకు వైద్యం అందిస్తున్నారు. ఖాళీలను భర్తీ చేయాలని పశుపోషకులు డిమాండ్ చేస్తున్నారు.
పోస్టు మంజూరు చేయాలి
మా గ్రామంలో పశువైద్యశాల ఉన్నా వైద్యాధికారి పోస్టు మంజూరు చేయలేదు. దీంతో సిబ్బందితో వైద్యం అందిస్తున్నారు. వైద్యాధికారి పోస్టు మంజూరు చేసి పశువులకు వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి. – రవి, కొరిటికల్, పశుపోషకుడు
సీజనల్ వ్యాధుల నివారణలో సవాళ్లు
వర్షాకాలంలో పశువులకు గుండెవాపు, జబ్బవాపు, గొర్రెలకు చిటుకు వ్యాధి వంటివి సోకే ప్రమాదం ఎక్కువ. వీటిని నివారించేందుకు టీకాలు వేయాల్సి ఉంటుంది. అయితే, సిబ్బంది కొరత, అరకొర సౌకర్యాలు ఈ ప్రక్రియను కష్టతరం చేస్తున్నాయి. అవసరమైనప్పుడు ఇతర కేంద్రాల నుంచి సిబ్బందిని పంపించి సేవలు అందిస్తున్నారు. ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే.