
నాళాలు శుభ్రం చేయాలి
నిర్మల్చైన్గేట్: వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో నాళాల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. నిర్మల్ పట్టణంలోని జౌలి నాళా, చైన్గేట్, దివ్యనగర్ పార్క్, రాంజీ గోండు విగ్రహ పరిసర ప్రాంతాల్లో గురువారం పర్యటించారు. నీటి ప్రవాహానికి అంతరాయం కలగకుండా నాళాల్లో పేరుకుపోయిన చెత్త, మట్టి తొలగించాలన్నారు. ప్రజలు నాళాల్లో చెత్త వేయకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పట్టణంలోని పార్కులను శుభ్రంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. పార్కులకు వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, అధికారులు హరిభువన్, శానిటరీ ఇన్స్పెక్టర్ దేవదాస్ పాల్గొన్నారు.