ఢిల్లీ: సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి.. సోషల్ మీడియా పోస్టు కేసు విచారణ వాయిదా పడింది. మంగళవారం విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ కేసుపై రేపు(బుధవారం) హైకోర్టులో విచారణలో అన్ని పక్షాల వాదనలను పరిగణలోకి తీసుకోవాలని ‘సుప్రీం’ కోరింది. అలాగే రేపటి హైకోర్టు విచారణ నేపథ్యంలో మధ్యంతర ఉపశమన చర్యలకు నిరాకరించింది. సోషల్ మీడియా పోస్టు కేసులో హైకోర్టు మద్యంతర ఉత్తరులను సుప్రీంకోర్టులో శ్రీహరి సవాల్ చేశారు. ఈ కేసు తదుపరి విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
కేసు వివరాల్లోకి వెళితే సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అభ్యంతరకర యానిమేషన్ చిత్రాలు, అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేశారనే అభియోగంపై వైఎస్సార్సీపీ నేత పూడి శ్రీహరి అనే వ్యక్తిని కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు కత్తి పట్టుకున్నట్లుగా ఉన్న యానిమేషన్ వీడియోలను వైరల్ చేశారని టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో, ఏప్రిల్ 1న తాడేపల్లిలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని ల్యాప్టాప్, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారంటూ శ్రీహరి తరపున హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. తొలుత ట్రయల్ కోర్టు రిమాండ్ను తిరస్కరించినప్పటికీ, పోలీసులు హైకోర్టును ఆశ్రయించగా ఆ ఉత్తర్వులపై స్టే లభించింది.
ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరగా, తనపై రాజకీయ కక్షసాధింపు జరుగుతోందని శ్రీహరి పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో విచారణ పెండింగ్లో ఉన్నందున, తాము ప్రస్తుతానికి జోక్యం చేసుకోలేమని, నిందితులకు ఎలాంటి మధ్యంతర రక్షణ కల్పించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను వెకేషన్ బెంచ్కు వాయిదా వేస్తూ, హైకోర్టు నిర్ణయానికే ప్రాధాన్యతనిచ్చింది.


