న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో కీలక భేటీ అయ్యారు. తరువాత కేంద్ర మంత్రి, ప్రముఖ నటుడు సురేష్ గోపీకి ఫోన్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సంభాషణ కేవలం మర్యాదపూర్వకం మాత్రమే కాదని, దేశాభివృద్ధి లక్ష్యంగా సాగిందని సురేష్ గోపీ స్వయంగా వెల్లడించారు.
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
ప్రధాని మోదీతో 20 నిమిషాల భేటీ ముగిసిన తర్వాతే తన ప్రియ మిత్రుడు, తమిళనాడు సీఎం విజయ్ ఫోన్ చేశారని సురేష్ గోపీ సోషల్ మీడియాలో తెలిపారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి, తద్వారా దేశ పురోగతికి కలిసి పనిచేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు ఆయన తెలియజేశారు.
ఢిల్లీ పర్యటనలో విజయ్ కీలక అజెండా
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ చేపట్టిన తొలి అధికారిక ఢిల్లీ పర్యటన కీలక అంశాలతో ముగిసింది. మెకేదాటు ప్రాజెక్ట్ వివాదం, తమిళ మత్స్యకారులపై శ్రీలంక నేవీ దాడులు, వందేమాతరం వివాదం వంటి సున్నితమైన సమస్యలను ఆయన ప్రధాని ముందుంచారు. ఈ అంశాలపై కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజయ్ విజ్ఞప్తి చేశారు.
చరిత్రక వారసత్వానికి ప్రాధాన్యత
ప్రాంతీయ సమస్యలతో పాటు, దేశ గౌరవానికి సంబంధించిన అంశాలపై కూడా విజయ్ దృష్టి సారించారు. నెదర్లాండ్స్ నుండి తిరిగి తీసుకువచ్చిన చోళుల కాలం నాటి రాగి శాసనాలను విజయవంతంగా స్వదేశానికి రప్పించినందుకు ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన పదవీకాలంలో ప్రజా సంక్షేమంతో పాటు, చరిత్రక వారసత్వాన్ని కాపాడటంలో కూడా కీలకంగా వ్యవహరిస్తానని విజయ్ పరోక్షంగా సంకేతాలిచ్చారు.


