రాష్ట్రం విడిపోతే రిజర్వేషన్‌ వర్తించదా? | Supreme Court: Does Reservation Apply If The State Split Question In Supreme Court | Sakshi
Sakshi News home page

రాష్ట్రం విడిపోతే రిజర్వేషన్‌ వర్తించదా?

Jul 21 2021 9:25 AM | Updated on Jul 21 2021 6:22 PM

Supreme Court: Does Reservation Apply If The State Split Question In Supreme Court - Sakshi

న్యూఢిల్లీ: షెడ్యూల్డ్‌ తరగతి(ఎస్సీ)కి చెందిన వ్యక్తి ఒక రాష్ట్రంలో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ పొందుతుండగా, ఆ రాష్ట్రం రెండుగా విడిపోతే.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో రిజర్వేషన్‌ కోరే హక్కు అతనికి ఉంటుందా? ఉండదా? ఇప్పుడు ఇదే ప్రశ్న సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. ఇది అసాధారణ, వింతైన ప్రశ్న అని న్యాయస్థానం మంగళవారం వ్యాఖ్యానించింది. దీన్ని తాము లోతుగా, క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. ఇలాంటి ప్రశ్న తమ వద్ద తలెత్తడం ఇదే మొదటిసారి అని తెలిపింది. సాధ్యాసాధ్యాలను తేల్చేయడానికి ఇప్పటిదాకా దీనికి సంబంధించిన చట్టాలు లేవని గుర్తుచేసింది. ఈ విషయంలో తమకు సహకరించాలని అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌కు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ధర్మాసనం విజ్ఞప్తి చేసింది.

అయితే, రాష్ట్రం విడిపోయినంత మాత్రాన రిజర్వేషన్లు మారవని కె.కె.వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. వెనుకబాటుతనం ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగుతాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎస్సీ వర్గానికి చెందిన పంకజ్‌ కుమార్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ యు.యు.లలిత్, జస్టిస్‌ అజయ్‌ రస్తోగితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారిస్తుండగా రిజర్వేషన్లపై కొత్త ప్రశ్న తెరపైకి వచ్చింది. బిహార్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో పంకజ్‌కు ఎస్సీ రిజర్వేషన్‌ సౌకర్యం లభించదంటూ జార్ఖండ్‌ హైకోర్టు 2020 ఫిబ్రవరి 24న తీర్పునిచ్చింది. స్టేట్‌ సివిల్‌ సర్వీసు పరీక్ష రాయడానికి అతడు అర్హుడు కాదని పేర్కొంది. దీన్ని సవాలు చేస్తూ పంకజ్‌ కుమార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

Advertisement
 
Advertisement
Advertisement