జరుగుబాటు అంతంతే | State Assemblies met for average 21 days in 2022 | Sakshi
Sakshi News home page

జరుగుబాటు అంతంతే

Jun 2 2023 5:02 AM | Updated on Jun 2 2023 5:02 AM

State Assemblies met for average 21 days in 2022 - Sakshi

న్యూఢిల్లీ: కీలకమైన అసెంబ్లీ సమావేశాలను రాష్ట్రాలు తక్కువ రోజుల్లోనే మమ అనిపిస్తున్నాయని మేధో సంస్థ పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ తాజా గణాంకాలు చాటుతున్నాయి. దేశవ్యాప్తంగా 2016 ఏడాది నుంచి అసెంబ్లీ సమావేశమైన రోజులు ఏటా తగ్గుతూ వస్తున్నాయని అధ్యయనం ఆందోళన వ్యక్తంచేసింది. అధ్యయనం ప్రకారం..

► 2022లో 28 రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు సగటున కేవలం 21 రోజులే జరిగాయి.
► కర్ణాటకలో అత్యంత ఎక్కువగా 45 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. తర్వాతి స్థానాల్లో పశ్చిమబెంగాల్‌( 42 రోజులు), కేరళ(41 రోజులు) నిలిచాయి.
► ఎక్కువ రాష్ట్రాల్లో ఏడాదిలో రెండు లేదా మూడుసార్లు సెషన్స్‌ పెడుతున్నారు. జనవరి–మార్చి మధ్య బడ్జెట్‌ పద్దు సందర్భంగా ఒక సెషన్‌. వర్షాకాల, శీతాకాల సమావేశాల కోసం మరో రెండు.
► ఈశాన్య రాష్ట్రాల్లోని ఐదు రాష్ట్రాలు కలుపుకుని 12 రాష్ట్రాల్లో గత ఏడాది కేవలం రెండు సెషన్స్‌యే జరిగాయి.
► మొత్తంగా సమావేశ రోజుల్లో బడ్జెట్‌ కోసమే 61 శాతం రోజులను కేటాయిస్తున్నారు. తమిళనాడులో ఏకంగా 90 శాతం సిట్టింగ్స్‌ ఒక్క బడ్జెట్‌ సెషన్‌తోనే గడిచిపోయింది. 80శాతానికి మించి సెషన్స్‌తో గుజరాత్, రాజస్తాన్‌ అదే బాటలో పయనించాయి.
► 20 రాష్ట్రాల్లో సగటు సమావేశాల కాలం కేవలం ఐదు గంటలు. మహారాష్ట్రలో మాత్రమే ఈ సగటు ఎనిమిది గంటలుగా నమోదైంది. సిక్కింలో అత్యల్పంగా రెండు గంటలే సెషన్‌ నడిచింది.
► 2016–2022 కాలంలో 24 రాష్ట్రాల్లో సగటు సమావేశాల కాలం కేవలం పాతిక రోజులు. కేరళలో ఏడాదికి గరిష్ఠంగా 48 రోజులు అసెంబ్లీ నడిచింది. ఒడిశా(41 రోజులు), కర్ణాటక(35 రోజులు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
► 2016 ఏడాది నుంచి సెషన్‌ రోజులు తగ్గుతూ వస్తున్నాయి. కోవిడ్‌ ఆంక్షల ధాటికి 2020లో ఈ సంఖ్య దారుణంగా పడిపోయింది.
► 2016లో 24 రాష్ట్రాల్లో సగటున 31 రోజులు, 2017లో 30 రోజులు, 2018లో 27 రోజులు, 2019లో 25 రోజులు, 2020లో 17 రోజులు, 2021లో 22 రోజులు సమావేశాలు నిర్వహించారు.
► అసెంబ్లీ సభ్యులను ప్రాతిపదికగా తీసుకుని సమావేశాల సంఖ్యపై కనీస పరిమితిని విధించుకుంటే మంచిదని రాజ్యాంగ పనితీరుపై సమీక్షకు జాతీయ కమిషన్‌(ఎన్‌సీఆర్‌డబ్ల్యూసీ) గతంలో రాష్ట్రాలను సూచనలు పంపడం గమనార్హం.
► కర్ణాటక, రాజస్తాన్, యూపీ వంటి రాష్ట్రాలు సంబంధిత లక్ష్యాలు నిర్దేశించుకున్నా అవి నెరవేరలేదు.
► రాజ్యాంగం నిర్దేశిన ప్రకారం ప్రతీ రాష్ట్రం తమ పద్దును అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాలి. 2022లో 20 రాష్ట్రాల్లో బడ్జెట్‌పై చర్చకాలం సగటు కేవలం ఎనిమిది రోజులే. ఒక్క తమిళనాడు మాత్రమే 26 రోజులపాటు బడ్జెట్‌పై చర్చించింది. కర్ణాటక(15 రోజులు), కేరళ(14 రోజులు), ఒడిశా(14 రోజులు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
► ఢిల్లీ, మధ్యప్రదేశ్, పంజాబ్‌ రెండ్రోజుల్లో ముగించగా, నాగాలాండ్‌ ఒక్కరోజుతో సరిపెట్టింది.
► 2022లో 28 రాష్ట్రాల్లో సగటున 21 బిల్లులు ఆమోదం పొందాయి. అస్సాంలో గరిష్టంగా 85 బిల్లులకు ఆమోదముద్ర పడింది. తమిళనాడు(51), గోవా(38) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
► విశ్లేషణాత్మక చర్చలేకుండానే ప్రభుత్వాలు బిల్లులను పాస్‌ చేస్తున్నాయి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement