న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో యూరప్లో పర్యటించనున్నారు. మే 15 నుంచి 20 వరకు ఆయన నార్వే, స్వీడన్, నెదర్లాండ్స్, ఇటలీలలో పర్యటించున్నారు. ఇంధన సరఫరాలను పరిరక్షించడం, పశ్చిమ ఆసియా సంక్షోభం వల్ల కలిగే వాణిజ్య అంతరాయాలను తగ్గించడం, కీలక సాంకేతికతలలో సహకారం బలోపేతం ఈ పర్యటనలో ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. ప్రధానమంత్రి నెదర్లాండ్స్ పర్యటన సెమీకండక్టర్లు, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ హైడ్రోజన్, వాణిజ్యం, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఒక అవకాశంగా నిలుస్తుందని భావిస్తున్నారు.
అలాగే, స్వీడన్ పర్యటన సందర్భంగా ఆవిష్కరణల రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఇరుపక్షాలు దృష్టి సారించనున్నాయి. ప్రధాని ఇటలీ పర్యటన వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాలతో సహా ద్వైపాక్షిక సంబంధాలను వేగవంతం చేయనుంది. ఇరు దేశాలు సైనిక పరికరాలను సంయుక్తంగా ఉత్పత్తి చేసేందుకు వీలుగా ఒక రక్షణ పారిశ్రామిక చట్రాన్ని రూపొందించే లక్ష్యంతో ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టో ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు. ప్రధాని యూరప్ పర్యటనపై ఇంకా అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు. అయితే, పర్యటనకు వెళ్లే లేదా వచ్చే మార్గంలో ప్రధాని మోదీ నాలుగు గంటలపాటు యూఏఈలో ఆగే అవకాశం ఉంది.


