మా గడ్డపై భారత వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగనివ్వం
ప్రధాని మోదీకి మయన్మార్ అధ్యక్షుడు యూమిన్ ఆంగ్ హామీ
ఢిల్లీలో ఇరునేతల ద్వైపాక్షిక చర్చలు
న్యూఢిల్లీ: తమ భూభాగాలను భారత వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మారనివ్వబోమని మయన్మార్ అధ్యక్షుడు యూమిన్ ఆంగ్ హ్లాయింగ్ పునరుద్ఘాటించారు. ఐదురోజుల భారత పర్యటన నిమిత్తం యూమిన్ సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. మయన్మార్ పార్లమెంటరీ ఎన్నికల్లో గెలిచి అధ్యక్షపీఠాన్ని అధిరోహించిన రెండు నెలలకే ఆయన భారత్లో పర్యటనకు రావడం విశేషం. ‘‘భారత భద్రతా ప్రయోజనాలకు విఘాతం కల్గించే కార్యకలాపాలకు మయన్మార్ను నెలవు కానివ్వం.
పొరుగుదేశంతో మిత్రత్వం మాకు ముఖ్యం’’అని భారత ప్రధాని మోదీతో భేటీలో హ్లాయింగ్ స్పష్టంచేశారు. మోదీ, హ్లాయింగ్లో ద్వైపాక్షిక సమావేశం వివరాలను తర్వాత భారత విదేశాంగ శాక కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాతో పంచుకున్నారు. ‘‘ఏళ్ల తరబడి జుండా సైనికపాలన తర్వాత మయన్మార్లో ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో హ్లాయింగ్ మోదీతో వాణిజ్యం మొదలు రక్షణ, సరిహద్దు భద్రత, అభివృద్ధిలో తోడ్పాటు, ఇంధనం, పెట్టుబడులు, వైద్యం, విద్య, కృత్రిమమేధ వంటి సంక్లిష్ట సాంకేతికతలో పరస్పర సహకారంపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మయన్మార్ సార్వబౌమత్వం, అంతర్గత సమగ్రతకు భారత్ కట్టుబడిఉంది. మయన్మార్లో నెలకొంటున్న శాంతియుత వాతావరణంపైనా మోదీ ఆరాతీశారు’’అని మిస్రీ తెలిపారు. ‘‘1,640 కిలోమీటర్ల మేర సరిహద్దు పంచుకుంటూ మయన్మార్ భారత్కు వ్యూహాత్మకమైన పొరుగుదేశంగా కొనసాగుతోంది. పరస్పర ప్రయోజనాలు, ప్రాంతీయాభివృద్ధి, శ్రేయస్సే పరమావధిగా ఇరుదేశాలు ఇకమీదటా కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి’’అని మిస్రీ పేర్కొన్నారు.


