
లోక్సభ ఎన్నికలు జరగనున్న వేళ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థుల కోసం ప్రధాని 'నరేంద్ర మోదీ' మార్చి 15, 17న కేరళలలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు ఈ రోజు (సోమవారం) తెలిపాయి.
నరేంద్ర మోదీ మార్చి 15న కేరళలోని పాలక్కాడ్కు వెళ్లనున్నట్లు, ఆ తరువాత 17న బీజేపీ అభ్యర్థి అనిల్ కే ఆంటోనీకి మద్దతును కూడగట్టడానికి మరోసారి పతనంతిట్టలో పర్యటించనున్నారు. మోదీ పాలక్కాడ్కు రాగానే భారీ రోడ్షో నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
మోదీ పాలక్కాడ్ పర్యటన సందర్భంగా.. పాలక్కాడ్, అలతూర్, పొన్నాని లోక్సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అభ్యర్థుల ప్రచారంపై మోదీ తన ప్రయత్నాలను కేంద్రీకరించాలని భావిస్తున్నారు. ఇప్పటికే నరేంద్ర మోదీ జనవరిలో రెండు సార్లు, ఫిబ్రవరిలో మరోసారి కేరళలో పర్యటించారు. ఇప్పుడు మళ్ళీ కేరళ పర్యటనకు సిద్దమవుతున్నట్లు సమాచారం.