న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఇంధన, పౌర మౌలిక వసతులపై జరుగుతున్న దాడులను ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఖండించారు. ఆయన శనివారం సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్తో ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియా పరిణామాలపై చర్చించారు. ఆ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలు కల్పించాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు తేల్చిచెప్పారు.
నౌకా మార్గాలను తెరిచి ఉంచాలని, తగిన భద్రత కల్పించాలని పేర్కొన్నారు. సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారతీయులకు సంక్షేమానికి తోడ్పాటు అందిస్తున్నందుకు యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్కు కృతజ్ఞతలు తెలియజేశానని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ప్రస్తుత సంక్షోభంపై అభిప్రాయాలు పంచుకున్నామని తెలిపారు. ఇరాన్లో యుద్ధం మొదలైన తర్వాత ప్రధాని మోదీ, సౌదీ యువరాజు ఫోన్లో మాట్లాడుకోవడం ఇది రెండోసారి. మోదీ ఇప్పటికే యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఇరాన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, మలేషియా, అమెరికా తదితర దేశాల పాలకులతో సంభాషించారు.


