
ప్రధాని మోదీకి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే హితవు
రాయిచూర్: ప్రతిపక్ష పార్టీలను అల్పంగా భావిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ వైఖరిని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తప్పుబట్టారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఏర్పాటైన అఖిలపక్ష భేటీకి రెండు సందర్భాల్లోనూ ప్రధాని మోదీ రాకపోవడం ప్రతిపక్షాలంటే ఆయనకున్న గౌరవం ఏపాటిదో తెలుస్తోందని వ్యాఖ్యానించారు. అఖిలపక్ష భేటీకి దేశవ్యాప్తంగా ఉన్న నాయకులంతా రాగా, ప్రధాని మోదీ ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు.
బదులుగా బిహార్లో ఎన్నికల ప్రచార ర్యాలీకి వెళ్లారని ఎత్తి చూపారు. ఇలాంటి వైఖరిని ప్రజలు హర్షించరని, ముఖ్యంగా దేశ యువత సహించబోదని ఆయన హెచ్చరించారు. దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకలోని రాయిచూర్లో సోమవారం జరిగిన బహిరంగం సభలో ఖర్గే ప్రసంగించారు.
‘కశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టన బెట్టుకున్నారు. ప్రతీకారంగా మన సైన్యం పాక్ భూభాగంపై దాడి జరిపి ఉగ్రవాదులను ఏరిపారేసింది. యావత్తూ దేశం, సైనిక బలగాలు ఏకమై దేశానికి రక్షణగా నిలవగా, కొందరు వ్యక్తులు మాత్రం ఇదంతా తమ ఘనతేనని చెప్పుకుంటున్నారు’అని ఖర్గే పేర్కొన్నారు.
ఆ వ్యక్తులు ఆర్మీలో కెపె్టన్, కల్నల్, లెఫ్టినెంట్ కల్నల్గా పనిచేసిన వారైతే దేశం కోసం పోరాడినందుకు గాను మనం ప్రశంసించి ఉండేవారం. కానీ, అలాంటిదేమీ లేకుండానే గొప్పలు పోతున్నారు’అని మోదీ సర్కారుపై పరోక్షంగా విమర్శలు కురిపించారు. మళ్లీ ట్రంపే అమెరికా అధ్యక్షుడిగా రావాలంటూ అమెరికాలో నినదించిన ప్రధాని మోదీ..మన వస్తు వులపై భారీగా ట్యాక్సులు విధించినా ఒక్క మాటకూడా మాట్లాడలేదని ఆరోపించారు.