జమిలి ఎన్నికలకు 2 దశల వ్యూహం  | One Nation, One Election may roll out in two phases | Sakshi
Sakshi News home page

జమిలి ఎన్నికలకు 2 దశల వ్యూహం 

Jun 2 2026 5:25 AM | Updated on Jun 2 2026 6:37 AM

One Nation, One Election may roll out in two phases

తొలివిడతగా 2029లో లోక్‌సభతో పాటు 20 రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి పోలింగ్‌ 

2034 నాటికి దేశవ్యాప్తంగా ఉమ్మడి ఎన్నికల ప్రక్రియ పూర్తికి ప్రణాళిక 

పలు అసెంబ్లీల పదవీకాలం పెంపు, కుదింపు 

2026 వర్షాకాల సమావేశాలకు నివేదిక సమర్పించనున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ 

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఒకే దేశం–ఒకే ఎన్నికలు విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సురక్షిత మార్గాలను అన్వేషిస్తోంది. రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాన్ని భారీగా కుదించడం లేదా పదేపదే ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తకుండా సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) రెండు దశల విధానంపై కసరత్తు చేస్తోంది. 2029, 2034 సంవత్సరాల్లో రెండు విడతలుగా దీన్ని అమలు చేసి, దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు మార్గం సుగమంచేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

2029లో తొలిసారి.. 2034 నాటికి పూర్తిస్థాయిలో.. 
జమిలీ ఎన్నికల చట్రంలోకి అన్ని రాష్ట్రాలను తీసుకురావడానికి రెండు దశలవారీగా ముందుకు సాగడం అత్యంత ఆచరణాత్మకమని జేపీసీ భావిస్తోంది. తొలి దశలో భాగంగా 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటే సుమారు 20 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. 2029 నుంచి ఉమ్మడి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి, 2034 నాటికి దేశమంతటా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే దిశగా అడుగులు పడుతున్నాయి. 

రాష్ట్రాల పదవీకాలంపై ప్రభావం 
20 రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఆయా రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలంపై పడే ప్రభావంపై అంచనాలు రూపొందించారు. 2028లో ఎన్నికల చక్రం ఉన్న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి ఐదు నెలల నుంచి ఏడాది పాటు పెంచాలని భావిస్తున్నారు. 2029 ఎన్నికల చక్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాల కాలపరిమితిలో ఎలాంటి మార్పు ఉండదు. 2030–31లో ఎన్నికలు జరగాల్సిన బిహార్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, పశి్చమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల శాసనసభల కాలపరిమితి ఒకటి నుంచి రెండేళ్లు తగ్గే ఆస్కారం ఉంది. 

రాజ్యాంగంలో వెసులుబాటు 
జమిలి ఎన్నికలను దశలవారీగా అమలు చేయడానికి రాజ్యాంగపరమైన అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీల కాలపరిమితి ముగియకముందే ఎన్నికలు నిర్వహించవచ్చని, కొన్నింటిలో కాలపరిమితిని పొడిగించే వెసులుబాటు ఉందని నిపుణులు పేర్కొన్నారు. గతంలోనూ ప్రత్యేక పరిస్థితుల్లో లోక్‌సభ, అసెంబ్లీల కాలపరిమితిలో మార్పులు జరిగాయని గుర్తుచేశారు. ఇంతటి భారీ మార్పునకు చట్టపరమైన నిబంధనలతో పాటు రాజకీ య ఏకాభిప్రాయం అవసరమని అభిప్రాయపడ్డారు. 

1967 వరకు ఒకేసారి పోలింగ్‌.. 
దేశంలో 1952 నుంచి 1967 వరకు నాలుగుసార్లు లోక్‌సభకు, మెజారిటీ శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1967 తర్వాత పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోవడం మొదలైంది. 1968–69 మధ్య అనేక అసెంబ్లీలు రద్దు కాగా, 1970లో లోక్‌సభ కాలపరిమితి ముగియకముందే రద్దయింది. దీంతో జమిలీ ఎన్నికల తంతుకు తొలిసారిగా బ్రేక్‌ పడింది. 1971లో లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు జరగడంతో రాష్ట్రాల్లో ఎన్నికలు వేర్వేరు సమయాల్లో జరగడం ప్రారంభమైంది. ఆ తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు, రాష్ట్రపతి పాలన, ముందస్తు ఎన్నికల కారణంగా ఈ అంతరం మరింత పెరిగింది. 

జమిలిపై వాదోపవాదనలు 
జమిలి ఎన్నికల విధానంపై అనుకూల, ప్రతికూల వాదనలు వ్యక్తమవుతున్నాయి. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే అభివృద్ధి పనులు ప్రభావితం కాకుండా ఉంటాయని జమిలీ ఎన్నికలను సమరి్థంచేవారు వాదిస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో పరిపాలనా యంత్రాంగం వెచ్చించే భారీ సమయం, ఖర్చు ఆదా అవుతాయని వారు పేర్కొంటున్నారు. శాసనసభల కాలపరిమితిని తగ్గించడం లేదా పెంచడం వల్ల ప్రజా తీర్పు, సమాఖ్య నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉందన్నది జమిలి ఎన్నికలను వ్యతిరేకించేవాళ్లు వాదిస్తున్నారు. జాతీయ స్థాయి ప్రభంజనంలో స్థానిక, ప్రాంతీయ సమస్యలు మరుగున పడిపోయే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

7 దేశాల విధానాలపై కోవింద్‌ ప్యానెల్‌ అధ్యయనం 
జమిలి ఎన్నికలపై అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అధ్యక్షతన 2023 సెపె్టంబర్‌ 2న ప్యానెల్‌ ఏర్పాటైంది. ఈ కమిటీ నివేదిక తయారు చేయడానికి ముందు ఏడు దేశాల ఎన్నికల ప్రక్రియలను అధ్య యనం చేసింది. నిపుణులతో చర్చలు, 191 రోజుల పరిశోధనల అనంతరం కోవింద్‌ కమిటీ తన నివేదికను మార్చి 14న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమర్పించింది. ప్రస్తుతం ఈ నివేదికను అధ్యయనం చేస్తున్న జేపీసీ తన నివేదికను 2026 వర్షాకాల సమావేశాల చివరి వారం మొదటి రోజు నాటికి సమర్పించాల్సి ఉంటుంది. నివేదిక అందిన తర్వాత పార్లమెంటులో తదుపరి చర్చ, ఓటింగ్‌ జరుగుతాయి.  
 

Advertisement
 
Advertisement
Advertisement