పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రధాని మోదీపై విరుచుకపడ్డారు. కోల్కతా దాకా దాడి చేస్తాం అని పాకిస్థాన్ ప్రగల్భాలు పలుకుతుంటే మోదీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ( సోమవారం) నైదా జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్పై తీవ్ర విమర్శలు చేశారు. "భారత్ గనుక ఈసారి ఏదైనా 'ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్' (కృత్రిమంగా దాడులు సృష్టించడం) చేయడానికి ప్రయత్నిస్తే, దేవుడి దయ వల్ల మేము ఆ యుద్ధాన్ని కోల్కతా వరకు తీసుకెళ్తాము" అని హెచ్చరించారు. అంటే, సరిహద్దులకే పరిమితం కాకుండా భారత్ లోపలికి చొచ్చుకెళ్లి కోల్కతా (తూర్పు తీరం వరకు) దాడులు చేస్తామని ఆయన పరోక్షంగా బెదిరించారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించనందుకు మమతా బెనర్జీ, ప్రధాని మోదీపై ఆగ్రహాం వ్యక్తం చేస్తూ మాట్లాడారు.
మమతా బెనర్జీ ప్రధాని మోదీ గురించి మాట్లాడుతూ " ప్రతి ఎన్నికల సభలో బెంగాల్ను టార్గెట్ చేసి మాట్లాడే మోదీ కోల్కతాపై దాడి చేస్తామని పాక్ మంత్రి హెచ్చరిస్తుంటే ఎందుకు స్పందించలేదు. ఒకవేళ ఈ ప్రాంతంపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎందుకు హెచ్చరించలేదు. దీనికి బాధ్యతగా ప్రధాని మోదీ రాజీనామా చేయాలి " అని ప్రధానిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అదే ఏవరైనా భారత్ అదే విధంగా కోల్కతాను టార్గెట్ చేస్తూ హెచ్చరిస్తే ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరించారు. కాగా ఈ నెల 23,29 తేదీలలో ఈ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి.


