శివాజీనగర: రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి స్థానాలను సృష్టించడం గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఆదివారం కల్బుర్గిలో విలేకరులతో మాట్లాడిన ఆయన, రెండు దశల్లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. డీసీఎం పదవుల గురించి ప్రస్తావన రాలేదు. జూన్ 3 తరువాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
నూతన ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటుగా తొలి దశలో ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాలనేది 2 రోజుల్లో ఖరారవుతుందన్నారు. తొలి దశ మంత్రిమండలి ఏర్పాటు తరువాత 15 రోజుల్లోగా 2వ దశ మంత్రివర్గ విస్తరణ అవుతుందని, పూర్తిస్థాయిలో కేబినెట్ ఏర్పాటవుతుందని తెలిపారు. ఒకవేళ డీసీఎంలు అవసరమైతే ఎంతమంది ఉండాలనేది చర్చిస్తాము, దీనిపై పార్టీలో అంతర్గతంగా చర్చలు జరిగాయి. జూన్ 3 తరువాత స్పష్టమైన చిత్రం లభిస్తుంది అని చెప్పారు.
కేపీసీసీ సారథిపై
కేపీసీసీ అధ్యక్షుని మార్పుపై ఖర్గే స్పందిస్తూ, సీఎం ప్రమాణం తరువాత సహజంగానే కేపీసీసీ కొత్త సారథి నియామకం అవుతుందని చెప్పారు. ప్రభుత్వం సుపరిపాలనకు ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుని మధ్య ఉత్తమ అవగాహన అవసరముందన్నారు. సీఎం, మంత్రులతో ఐకమత్యంతో పనిచేయాలన్నారు. పార్టీ నిర్మాణంలో శక్తియుక్తులు, ప్రజా మద్దతు కలిగిన నేతను పార్టీ అధ్యక్షునిగా నియమించాలని చర్చలు జరిగాయన్నారు.


