హరిపాడు: కేరళలోని అలప్పుజ జిల్లా, హరిపాడు ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఒక ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కడుపునొప్పిగా ఉందని చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన 19 ఏళ్ల విద్యార్థిని, టాయిలెట్లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తరువాత ఆ నవజాత శిశువును ఆస్పత్రి టాయిలెట్ వెంటిలేటర్ గుండా బయటకు విసిరేసింది.
ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తతతో..
తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో విద్యార్థిని టాయిలెట్లోకి వెళ్లిన కొద్దిసేపటికే, బయట నుంచి పసికందు ఏడుపు వినిపించడాన్ని డ్యూటీలో ఉన్న వైద్యులు, నర్సింగ్ సిబ్బంది గమనించారు. డాక్టర్లు తిష, డాక్టర్ ఆల్ఫీ, నర్సింగ్ ఆఫీసర్ జిషా, సిబ్బంది వెంటనే ఆ ప్రాంతంలో గాలించారు. ఆస్పత్రి భవనం వెలుపల పడి ఉన్న శిశువును గుర్తించి రక్షించారు.
ప్రాణాపాయం నుంచి..
ఆ ప్రాంతంలో వీధి కుక్కల సంచారం ఎక్కువగా ఉండటం వల్ల, చిన్నారికి ప్రమాదం పొంచి ఉండేది. కానీ, సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి, వేగంగా స్పందించడం వల్ల శిశువు ప్రాణాలతో దక్కింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, పసికందు సురక్షితంగా ఉంది. ప్రస్తుతం చిన్నారి, ఆమె తల్లి ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే తల్లికి, బిడ్డకు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం వారిద్దరినీ ఆలప్పుజ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: గోవధ నిషేధంపై పిటిషన్.. సీజేఐ ఘాటు వ్యాఖ్యలు!


