న్యూఢిల్లీ: కేరళ ముఖ్యమంత్రి ఎంపిక ఘట్టం తుది దశకు చేరుకుంది. ముఖ్య మంత్రి కుర్చీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత)కేసీ వేణుగోపాల్ కూర్చునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అధిష్టానం పంపిన పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ బుధ, గురువారాల్లో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో వేర్వేరుగా మాట్లాడి అభిప్రాయాలు సేకరించారు.
పార్టీకి చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలతో కూడా మాట్లాడి, అభిప్రాయాలను సేకరించారు. ఇందుకు సంబంధించిన తుది నివేదికను వారు శుక్రవారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. అంతిమ నిర్ణయం ఇప్పుడు ఖర్గే చేతుల్లో ఉంది. దీనిపై త్వరలోనే ఆయన నిర్ణయం ప్రకటిస్తారని భావిస్తున్నారు. కాగా, ఎమ్మెల్యేల్లో అత్యధికులు కేసీ వేణుగోపాల్ వైపే మొగ్గు చూపినట్లు విశ్వసనీయ వర్గాలంటున్నాయి.
సీఎం పదవిని చేపట్టేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ స్థాయిలో ఉన్న పలుకుబడితోపాటు అగ్ర నేత రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ముఖ్యమంత్రి పదవి ఆయన్ని వరించే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ నేత, గత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న వీడీ సతీశన్ వైపు కూడా మొగ్గు చూపినట్లు సమాచారం. మరో సీనియర్ నేత రమేశ్ చెన్నితాల కూడా సీఎం రేసులో ఉన్నారు.


