
కన్నడ భాష వివాదం నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందించారు. తన వ్యాఖ్యలు ప్రేమతో చేసినవేనని, ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణలు చెప్పబోనంటూ స్పష్టం చేశారాయన. బుధవారం థగ్ లైఫ్ ఈవెంట్లో ఈ అంశంపై ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో తనను విమర్శించిన నేతలకూ ఆయన చురకలంటించారు.
‘‘ఈ ఇష్యూపై గందరగోళం నెలకొంది. అందుకే స్పష్టత ఇవ్వదల్చుకున్నా. చాలామంది చరిత్రకారులు(రాజకీయ నాయకులను ఉద్దేశించి ఎద్దేవా చేస్తూ..) నాకు భాష చరిత్ర గురించి పాఠాలు బోధిస్తున్నారు. కానీ, నాతో సహా రాజకీయ నాయకులెవరికీ భాష వ్యవహారంపై మాట్లాడే అర్హత లేదు. తమిళనాడు అరుదైన రాష్ట్రం. తమిళంతో పాటు మీనన్, రెడ్డి, అయ్యంగార్ ముఖ్యమంత్రులయ్యారు.
చాలా కాలం కిందట కర్ణాటక నుంచి వచ్చి తమిళనాడుకు సీఎం అయిన వ్యక్తి నుంచి నాకు సమస్య ఎదురైంది. ఆ సమయంలో కర్ణాటక నాకు మద్దతు ఇచ్చింది. ఎక్కడికీ వెళ్లొద్దు.. ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకోండి అంటూ కన్నడ ప్రజలు ప్రేమ చూపించారు. కాబట్టి ఇప్పుడు కూడా థగ్ లైఫ్, కమల్ హాసన్ను ప్రజలే చూసుకుంటారు.
#WATCH | Thiruvananthapuram, Kerala: On his recent remarks where he said, 'Kannada was born out of Tamil', MNM President and actor Kamal Haasan says, "... What I said was said out of love and a lot of historians have taught me language history. I didn't mean anything. Tamil Nadu… pic.twitter.com/YjW8qAUIB3
— ANI (@ANI) May 28, 2025
భాషా వ్యవహారం చాలా లోతైన అంశం. నాతో సహా ఏ రాజకీయ నాయకుడికి దాని గురించి మాట్లాడే అర్హత లేదు. కాబట్టి ఈ చర్చను భాషా నిపుణులు, చరిత్రకారులు, పురావస్తు శాఖ వాళ్లకు వదిలేయండి. శివన్న, ఆయన తండ్రి మీద ప్రేమతో ఒక కుటుంబ సభ్యుడిగా మాట్లాడిందే తప్ప అందులో మరే ఉద్దేశం లేదు. ప్రేమతోనే మాట్లాడినప్పుడు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. కాబట్టి ఆ పని చేయను’’ అని కమల్ అన్నారు.
ఇటీవల చెన్నైలో తన చిత్రం థగ్ లైఫ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. కన్నడకు తమిళ భాష జన్మనిచ్చిందని శివరాజ్ కుమార్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై కన్నడ సంఘాల నాయకులు ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదు చేశారు. ‘కన్నడ- కస్తూరి’ అనే విషయాన్ని ఆ నటుడు మర్చిపోయినట్లు ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. రెండున్నర వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న భాషను కమల్ మర్చిపోయినట్లు ఉందని సీనియరు నటుడు జగ్గేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్ నటించిన ‘థగ్ లైఫ్’ చిత్ర ప్రదర్శనను కర్ణాటకలో అడ్డుకుంటామని వివిధ సంఘాల నాయకులు ప్రకటించారు. ఆయనపై నిషేధం విధిస్తామని కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి ప్రతినిధులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ సీఎం యడియూరప్ప, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బి.వై.విజయేంద్ర, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి, కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు నారాయణ గౌడ తదితరులు కమల్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు.