ఇండిగో సంక్షోభంపై కేంద్రం సీరియస్‌ : ఉన్నత స్థాయి విచారణ | Indigo crisis Centre Orders High Level Probe Expects Fix In 3 Days | Sakshi
Sakshi News home page

ఇండిగో సంక్షోభంపై కేంద్రం సీరియస్‌ : ఉన్నత స్థాయి విచారణ

Dec 5 2025 6:16 PM | Updated on Dec 5 2025 6:52 PM

Indigo crisis Centre Orders High Level Probe Expects Fix In 3 Days

ఇండిగో  సంక్షోభం కేంద్రం సీరియస్‌గా స్పందించింది. ఈ వ్యవహారంపై  కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఈ మొత్తం వ్యవహారంపై విచారణ నిమిత్తం ఉన్నత స్థాయి కమిటినీ  నియమించింది. శనివారం నాటికి విమాన షెడ్యూల్ సరి అవుతుందని, మూడు రోజుల్లో సోమవారం నాటికి సాధారణ స్థితికి తిరిగి వచ్చే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. రద్దయిన విమాన సర్వీసులకు సంబంధించి ప్రయాణికులకు పూర్తి రీఫండ్‌ చేయాలని ఇండిగో సంస్థను ఆదేశించింది. ప్రయాణికులకు వసతి ఏర్పాట్లు చేయాలని సూచించింది.

వరుసగా ఇండిగో విమానల రద్దు, ప్రయాణీకుల ఆందోళన  సందర్భంగా, పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.  ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని విమానయాన మంత్రి తెలిపారు. దీనిపై తక్షణమే స్పందించిన విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈ జాప్యాలు, విమానాల రద్దులకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేసేందుకు నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఈ ప్యానెల్‌లో సంజయ్ కె బ్రహ్మణే (జాయింట్ డైరెక్టర్ జనరల్), అమిత్ గుప్తా (డిప్యూటీ డైరెక్టర్ జనరల్), కెప్టెన్ కపిల్ మాంగ్లిక్ (SFOI), మరియు కెప్టెన్ లోకేష్ రాంపాల్ (FOI) ఉంటారు.

ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనలను డీజీసీఏ సవరించడం సరికాదని కేంద్రం అభిప్రాయపడింది పైలట్లు, సిబ్బందికి తగినంత విశ్రాంతి లభించేలా చూడటం లక్ష్యంగా విమాన విధి సమయ పరిమితులపై కొన్నినిబంధనలను నిలిపివేయడాన్నిసమర్థిస్తూ, ఈ చర్య ప్రయాణీకుల ప్రయోజనాల కోసమేననీ, భద్రతలో రాజీ పడేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఇండిగో వైఫల్యం నేపథ్యంలో ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసింది.

ఇదీ చదవండి: కొత్త జంటకు ‘ఇండిగో’ తిప్పలు, ఆన్‌లైన్‌లోనే రిసెప్షన్‌

సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. వారికి లాంజ్ యాక్సెస్, వారి ప్రయాణ అనుభవం సౌకర్యవంతంగా ఉండేలా అన్ని సాధ్యమైన సహాయం అందించాలని పేర్కొంది. అంతేకాకుండా, విమానాలు ఆలస్యం కావడం వల్ల ప్రభావితమైన అన్ని ప్రయాణీకులకు రిఫ్రెష్‌మెంట్‌లు , అవసరమైన సేవలు అందించాలని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.  సాధారణ విమానయాన సేవలు వీలైనంత త్వరగా పునరుద్ధరించబడటానికి,ప్రయాణికులకుకలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి కార్యాచరణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

ఇదీ చదవండి: ఇండిగో సంక్షోభం : తండ్రి చితాభస్మం కలశంతో కుమార్తె నమిత ఆవేదన

కమిటీ విచారణ
ఇండిగోలో ఎక్కడ తప్పు జరిగింది అనేది విచారణ కమిటీ పరిశీలిస్తుంది, తగిన చర్యలకు అవసరమైన చోట జవాబుదారీతనాన్ని నిర్ణయిస్తుంది .భవిష్యత్తులో ప్రయాణీకులు మళ్లీ అలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉండేలా ఇలాంటి అంతరాయాలను నివారించడానికి చర్యలను సిఫార్సు చేస్తుంది. విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఉత్తర్వుల్లో సవరించిన విమాన విధి సమయ పరిమితులను (FDTL) పాటించడానికి విమానయాన సంస్థలకు తగినంత సమయంఇచ్చినట్టు డీజీసీఏ పేర్కొంది. 15 రోజుల్లోపు కమిటీ నివేదికను డీజీసీఏకు సమర్పిస్తుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement