‘విమానం రాలేదు.. దయచేసి ఉద్యోగం తీసేయకండి’ | IndiGo crisis left passengers sparking emotional scenes at airports | Sakshi
Sakshi News home page

‘విమానం రాలేదు.. దయచేసి ఉద్యోగం తీసేయకండి’

Dec 5 2025 5:45 PM | Updated on Dec 5 2025 5:54 PM

IndiGo crisis left passengers sparking emotional scenes at airports

భారత్‌లో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అమలు చేసిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్‌డీటీఎల్‌) నిబంధనల కారణంగా పైలట్ల కొరతతో సర్వీసుల అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభం కారణంగా గురువారం ఒక్కరోజే 500కి పైగా విమానాలు రద్దయ్యాయి. ఈనేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈమేరకు ఢిల్లీకి చెందిన ఓ ప్రయాణికుడు సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

ఢిల్లీ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడు ఏడుస్తూ సర్వీసుల ఆలస్యం కారణంగా తన ఉద్యోగం కోల్పోతానని భయపడుతూ చేసిన పోస్ట్‌ కొద్ది సమయంలో వైరల్‌ అయింది. అందులో ప్రయాణికుడు ఏడుస్తూ ‘ప్రయాణం ఆలస్యం కారణంగా నన్ను ఉద్యోగం నుంచి తొలగించకూడదని దయచేసి నా బాస్‌కి చెప్పండి’ అని చెప్పడం గమనించవచ్చు.

పుణెలో డాక్టర్ ప్రశాంత్ పన్సారే ‘గేట్ వద్ద సమస్య గురించి కమ్యునికేట్‌ చేయడానికి సిబ్బంది ఎవరూ కనిపించడం లేదు. బోర్డులో మాత్రం షెడ్యూల్ ప్రకారం విమాన సర్వీసులు చూపిస్తున్నాయి’ అని ఫిర్యాదు చేశారు.

పైలట్ల కొరతే కారణం

డీజీసీఏ అమలు చేసిన కొత్త ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనల కారణంగా పైలట్లకు వారంలో 36 గంటల నుంచి 48 గంటల విశ్రాంతి తప్పనిసరి చేశారు. అలాగే, రాత్రి వేళల్లో ల్యాండింగ్‌ల సంఖ్యను ఆరు నుంచి రెండుకు తగ్గించారు. విమానయాన భద్రతను పెంచే లక్ష్యంతో తీసుకువచ్చిన ఈ మార్పులు ప్రత్యేకించి రాత్రి వేళల్లో అధిక విమానాలను నడిపే ఇండిగో ఆపరేషన్లపై తీవ్ర ప్రభావం చూపాయి. కొత్త నిబంధనల అమలుకు తగినంత మంది పైలట్లను నియమించుకోవడంలో ఇండిగో వైఫల్యం చెందిందని పైలట్ సంఘాలు ఆరోపించాయి. దీనివల్లనే ఈ సంక్షోభం ఏర్పడిందని పేర్కొన్నాయి.

ఇదీ చదవండి: ఇండిగో సంక్షోభానికి కారణాలు ఇవేనా..

Advertisement
 
Advertisement
Advertisement