పహల్గాం ఘటన.. పేలుడులో కశ్మీరీ ఉగ్రవాదుల నివాసాలు ధ్వంసం! | Indian Army Blast Pahalgam Incident Adil Thoker And Asif Sheikh Houses, Watch Videos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

పహల్గాం ఘటన.. పేలుడులో కశ్మీరీ ఉగ్రవాదుల నివాసాలు ధ్వంసం!

Apr 25 2025 10:21 AM | Updated on Apr 25 2025 11:39 AM

Indian Army Blast Pahalgam Incident Adil Asif Houses

పహల్గాం దాడిలో పాల్గొన్న ఇద్దరు కశ్మీరీ ఉగ్రవాదుల నివాసాలు పేలుళ్లలో దెబ్బతిన్నాయి. అసిఫ్‌ షేక్‌((Asif Sheikh) , అదిల్‌ హస్సేన్‌ తోకర్‌ల ఇళ్లను భద్రతా బలగాలు గురువారం తఖీలు చేస్తుండగా ఇది చోటు చేసుకుంది. బలగాలను లక్ష్యంగా చేసుకునే వాళ్లు పేలుడు పదార్థాలు అమర్చి ఉంటారా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. 

మంగళవారం మధ్యాహ్నాం పహల్గాం బైసరన్‌ లోయలో జరిగిన మారణకాండలో 26 మంది టూరిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఈ ఇద్దరు కశ్మీరీలు పాల్గొన్నట్లు సైన్యం ధృవీకరించుకుంది.  దాడి తర్వాత ఈ ఇద్దరితో పాటు ఉగ్రవాదులంతా పిర్‌పంజల్‌ పర్వతాల్లో దాక్కొని ఉండొచ్చని భద్రతా బలగాలు భావించి గాలింపు చేపట్టాయి. డ్రోన్‌లు, భద్రతా బలగాల కూంబింగ్‌తో ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాయి.

అదిల్‌ హస్సేన్‌ తోకర్‌ స్వస్థలం అనంత్‌నాగ్‌ కాగా,  అసిఫ్‌ షేక్‌((Asif Sheikh)ది  త్రాల్‌. గురువారం  ఈ ఇద్దరి నివాసాలను భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఆ సమయంలో ఐఈడీ పేలుడు పదార్థాలు యాక్టివేట్‌ ఉండడం గమనించి బయటకు వచ్చాయి. ఈ క్రమంలో పేలుడు సంభవించి నివాసాలు పేలిపోయాయి. తొలుత ఆర్మీనే వీటిని పేల్చినట్లు కథనాలు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత అధికారులు ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. అలాగే.. బుల్డోజర్‌తో నివాసాలను కూల్చిన కథనాల్లోనూ వాస్తవం లేదని తెలిపారు.

అనంత్‌ నాగ్‌ పోలీసులు ఈ ఇద్దరితో పాటు మరో ఇద్దరు పాక్‌ టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు సైతం ప్రకటించారు.  గురువారం రాత్రి ఈ ఇద్దరి ఇళ్లను ఐఈడీతో భద్రతా బలగాలు ధ్వంసం చేశారు. 2018లో పాక్‌కు వెళ్లిన ఈ ఇద్దరూ.. లష్కరే తాయిబా ఉగ్ర సంస్థలో చేరి శిక్షణ తీసుకున్నారు. ఈ ఇద్దరూ ఈ మధ్యే మరో నలుగురితో కలిసి కశ్మీర్‌లోకి చొరబడినట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి.  

అదిల్‌ హుస్సేన్‌ తోకర్‌కు ఇద్దరు సోదరులు. అనంత్‌ నాగ్‌లో కొంత భూమి ఉంది ఈ కుటుంబానికి. అసిఫ్‌ కుటుంబానికి సంబంధించిన వివరాలు పెద్దగా తెలియరాలేదు. పహల్గాం దాడి తర్వాత ఈ ఇద్దరి కుటుంబాలను భద్రతా బలగాలు రహస్య ప్రాంతానికి తరలించి విచారణ జరుపుతున్నట్లు అక్కడి మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement