మూడోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు | India Petrol Diesel Rates Third Time Hiked News Details | Sakshi
Sakshi News home page

మూడోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

May 23 2026 6:27 AM | Updated on May 23 2026 7:12 AM

India Petrol Diesel Rates Third Time Hiked News Details

వాహనదారులకు మరోసారి షాక్‌ తగిలింది. దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు మళ్లీ పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌కు 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచుతూ ఆయిల్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు శనివారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. పది రోజుల వ్యవధిలో ఇది మూడోసారి పెంపు.. 

పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్‌తో.. అధిక ధరలకు క్రూడాయిల్‌ను కొనుగోలు చేస్తూ నష్టపోతున్నామని భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు కొన్నివారాలుగా గగ్గోలు పెడుతూ వచ్చాయి.  ఒక అంచనా ప్రకారం ఆ లెక్క రూ.1,600 కోట్లు ఉందని.. వినియోగదారులపై ఆ భారం వేయకుండా వచ్చామని ఇన్నాళ్లు చెబుతూ వచ్చాయి. మరోవైపు కేంద్రం కూడా ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంచేందుకు ఇంధన ధరలు పెంచలేదు. అలాగే ధరల పెరుగుదలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం వసూలును తాత్కాలికంగా నిలిపివేసింది.

ఈ తరుణంలో.. చమురు రేట్లు దూసుకుపోతున్న తరుణంలో ఇప్పుడు పెంపు తప్పడం లేదని ఆయిల్‌ కంపెనీలు, కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. 

  • మే 15.. రెండింటిపైనా రూ.3 చొప్పున పెంపు
  • మే 19.. పెట్రోల్‌పై 86 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెంపు
  • మే 23.. 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంపు 

దీర్ఘకాలంగా కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ యుద్ధం, హర్ముజ్‌ జలసంధి దిగ్బంధనం కారణంగా నౌకా రవాణా ఆగిపోవడంతో చమురు, వాయువు సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే మరోసారి యుద్ధ వాతావరణం నెలకొనడం.. హర్ముజ్‌ ఉద్రిక్తతలు చల్లారకపోవడంతో ఈ పెంపు ఇక్కడితో ఆగకపోవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

భవిష్యత్తులో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదని, దీంతో రాబోయే రోజుల్లో ఇంధన ధరల పెంపు మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. చమురు కంపెనీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాల నుంచి బయటపడడానికి ఇప్పటికీ చేసిన పెంపు సరిపోదని అంటున్నారు. మరో రెండు వారాలపాటు దశలవారీగా గానీ కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు. 

✔️ తాజా పెంపు తర్వాత ప్రధాన నగరాల్లో కొత్త ధరలు ఇలా ఉన్నాయి (పెట్రోల్‌ 87 పైసలు, డీజిల్‌ 91 పైసలు పెరిగిన తర్వాత):

  • ఢిల్లీ: పెట్రోల్‌ ₹99.50, డీజిల్‌ ₹92.41
  • ముంబై: పెట్రోల్‌ ₹108.27, డీజిల్‌ ₹94.77
  • హైదరాబాద్‌: పెట్రోల్‌ ₹112.23, డీజిల్‌ ₹100.44
  • కోల్‌కతా: పెట్రోల్‌ ₹110.18, డీజిల్‌ ₹96.76
  • చెన్నై: పెట్రోల్‌ ₹105.53, డీజిల్‌ ₹97.13
  • బెంగళూరు: పెట్రోల్‌ ₹107.69, డీజిల్‌ ₹95.73
  • పాట్నా: పెట్రోల్‌ ₹110.27, డీజిల్‌ ₹96.52
  • జైపూర్‌: పెట్రోల్‌ ₹109.76, డీజిల్‌ ₹95.23
  • తిరువనంతపురం: పెట్రోల్‌ ₹112.11, డీజిల్‌ ₹101.00
  • చండీగఢ్‌: పెట్రోల్‌ ₹99.03, డీజిల్‌ ₹87.19
  • విజయవాడ (ఏపీ): పెట్రోల్‌ ₹115.35, డీజిల్‌ ₹103.08
  • విశాఖపట్నం (ఏపీ): పెట్రోల్‌ ₹113.83, డీజిల్‌ ₹101.23

గమనిక: ధరల్లో ప్రాంతానుసారం స్వల్ప మార్పులు ఉండొచ్చు

Advertisement
 
Advertisement
Advertisement