ఎబోలా కలకలం.. కేంద్రం హెచ్చరిక | India Issues Urgent Travel Advisory for Congo Uganda and South Sudan Amid Ebola Crisis | Sakshi
Sakshi News home page

ఎబోలా కలకలం.. కేంద్రం హెచ్చరిక

May 24 2026 9:55 AM | Updated on May 24 2026 9:55 AM

India Issues Urgent Travel Advisory for Congo Uganda and South Sudan Amid Ebola Crisis

న్యూఢిల్లీ: ఆఫ్రికా ఖండంలోని డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్‌సీ), ఉగాండా, దక్షిణ సూడాన్‌లలో ఎబోలా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రాణాంతకమైన ‘బుండిబుగ్యో’ రకం ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో, భారత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఈ దేశాలకు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని భారత పౌరులను హెచ్చరించింది.

అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి
ప్రపంచ ఆరోగ్య సంస్థ మే 17న, ఈ ఎబోలా వ్యాప్తిని ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్’గా ప్రకటించింది. అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం ఈ వైరస్ ముప్పు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (ఆఫ్రికా సీడీసీ) సైతం, దీనిని ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ కాంటినెంటల్ సెక్యూరిటీ’గా పేర్కొంటూ కఠిన నిఘా ఉంచాలని సూచించింది.

ఎబోలా వ్యాప్తి ఎలా జరుగుతుంది?
ఎబోలా అత్యంత ప్రమాదకరమైన వైరల్ వ్యాధి. ఇది సోకిన వ్యక్తుల రక్తం, వాంతులు, వీర్యం, చెమట, ఇతర శరీర ద్రవాలతో నేరుగా సంబంధం ఏర్పడినప్పుడు ఇతరులకు వేగంగా వ్యాపిస్తుంది. ఒకసారి వైరస్ సోకిన తర్వాత, వ్యాధి తీవ్రత చాలా వేగంగా పెరుగుతుంది. సకాలంలో సరైన చికిత్స అందకపోతే, ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గుర్తించాల్సిన లక్షణాలు
ఈ వ్యాధి సోకిన వారిలో జ్వరం, తీవ్రమైన నీరసం, కండరాల నొప్పులు, వాంతులు, విరేచనాలు ప్రధాన లక్షణాలుగా కనిపిస్తాయి. వ్యాధి తీవ్రత పెరిగేకొద్దీ, శరీరంలో అంతర్గత లేదా బాహ్య రక్తస్రావం జరగవచ్చు. ఈ లక్షణాలు ఏమాత్రం కనిపించినా, వెంటనే వైద్య సహాయం పొందడం అత్యవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా దేశాలకు వెళ్లే భారతీయులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement