చైనాకు చెక్‌.. పుతిన్‌తో భారత్ భారీ ఒప్పందం | India Defence Deal With Russia Over Voronezh radar | Sakshi
Sakshi News home page

చైనాకు చెక్‌.. పుతిన్‌తో భారత్ భారీ ఒప్పందం

Dec 11 2024 8:15 AM | Updated on Dec 11 2024 8:15 AM

India Defence Deal With Russia Over Voronezh radar

ఢిల్లీ: భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రష్యా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో రాజ్‌నాథ్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, రక్షణ సహాకారంపై చర్చించారు. రష్యా స్నేహితులకు భారత్‌ అన్నివేళలా అండగా నిలుస్తుందని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. ఇదే సమయంలో రష్యాతో భారత ప్రభుత్వం భారీ రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది.

రష్యా పర్యటనలో రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక ఒప్పందంపై చర్చించారు. రాడార్‌ వ్యవస్థకు సంబంధించిన భారీ రక్షణ ఒప్పందాన్ని రష్యాతో భారత్‌ కుదుర్చుకుంది. సుమారు నాలుగు బిలియన్‌ డాల‌ర్ల ఖ‌రీదైన ఒప్పందం తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు తెలుస్తోంది. లాంగ్ రేంజ్ వార్నింగ్ రాడార్‌ వ్య‌వ‌స్థ‌ వోరోనెజ్ రాడార్(Radar Voronezh)ను ర‌ష్యా నుంచి భార‌త్ కొనుగోలు చేయ‌నున్న‌ది. ఆ ఒప్పందానికి చెందిన సంప్ర‌దింపులు తుది ద‌శ‌లో ఉన్న‌ట్లు భారత ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి.

దేశ రక్షణ విషయంలో కేంద్రం టెక్నాలజీని పెంచే ఉద్దేశ​ంతో ముందడుగు వేసింది. మిస్సైల్ బెదిరింపుల్ని గుర్తించి, ట్రాక్ చేసేందుకు సామ‌ర్థ్యాన్ని పెంచుకోవాల‌ని భార‌త్‌ ప్లాన్‌ చేస్తోంది. ఇందులో భాగంగానే రాడార్‌ వ్యవస్థ కొత్త టెక్నాలజీపై ఫోకస్‌ పెట్టింది. అయితే, అల్మాజ్‌-ఆంటే కార్పొరేష‌న్ కంపెనీ వోరోనేజ్ రేడార్‌ల‌ను ఉత్ప‌త్తి చేస్తున్న‌ది. ఏరోస్పేస్ ఎక్విప్మెంట్‌, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ సిస్ట‌మ్స్‌, రేడార్ల ఉత్ప‌త్తిలో ఆ సంస్థ అగ్ర‌స్థానంలో ఉన్న‌ది.

ఈ నేప‌థ్యంలోనే సుదీర్ఘ దూరం నుంచి క్షిప‌ణుల క‌ద‌లిక‌ల్ని రాడార్ల‌తో ప‌సిక‌ట్టేందుకు ఈ కొనుగోలు చేప‌ట్ట‌నున్నారు. అధునాతన రాడార్ వ్యవస్థ చైనా, దక్షిణ, మధ్య ఆసియా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఎక్కడి నుంచి అయినా ముప్పును గుర్తించగలదు. దాదాపు 8 వేల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న బాలిస్టిక్ క్షిప‌ణులు, విమానాల‌ను వోరోనేజ్ రాడార్ వ్య‌వ‌స్థ గుర్తిస్తుంద‌ని అధికారులు అంటున్నారు. కొన్ని దేశాల వ‌ద్దే ఉన్న ఇలాంటి టెక్నాల‌జీని ఇప్పుడు భార‌త్ కూడా సొంతం చేసుకోనున్న‌ట్లు ర‌ష్యా చెబుతోంది.

ఇక, ఇటీవ‌ల అల్మేజ్‌-ఆంటే బృందం భార‌త్‌లో ప‌ర్య‌టించింది. మేకిన్ ఇండియాలో భాగంగా సుమారు 60 శాతం రాడార్ వ్య‌వ‌స్థ‌ను భార‌తీయ కంపెనీల ఉత్ప‌త్తుల‌తోనే నిర్మించ‌నున్నారు. క‌ర్నాట‌క‌లోని చిత్ర‌దుర్గ‌లో దీన్ని ఇన్‌స్టాల్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఇక్క‌డ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ , ఏరోస్పేస్ సౌక‌ర్యాలు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement